
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో , ఇరాన్ సరికొత్త వ్యూహాన్ని అవలంబించింది. దాని ప్రభావం కేవలం యుద్ధానికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న సంఘర్షణ సమయంలో, ఇరాన్ సైనిక స్థావరాలను నేరుగా లక్ష్యంగా చేసుకోకుండా, ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలను లక్ష్యంగా చేసుకుంది.
ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ హోర్ముజ్ జలసంధిని ఉపయోగించుకుంది. ప్రపంచ చమురులో అధిక భాగం దీని గుండానే వెళుతుంది. కాబట్టి ఈ సముద్ర మార్గం చాలా కీలకమైనది. అంతేకాకుండా, ప్రపంచ గ్యాస్ సరఫరాలో సుమారు 20% వాటా కలిగిన, ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ కేంద్రమైన రాస్ లఫాన్ ఇండస్ట్రీస్ సిటీపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో అనేక క్షిపణులను ప్రయోగించగా, వాటిలో కొన్నింటిని అడ్డుకున్నారు. కానీ ఒకటి నేరుగా ప్లాంట్ను తాకి, గణనీయమైన నష్టాన్ని కలిగించింది. గ్యాస్ను ద్రవ ఇంధనంగా మార్చే షెల్ పెర్ల్ GTL ప్లాంట్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
QatarEnergy Statement on Missile Attacks on Ras Laffan Industrial City
QatarEnergy confirms that Ras Laffan Industrial City this evening has been the subject of missile attacks.
Emergency response teams were deployed immediately to contain the resulting fires, as extensive…
— QatarEnergy (@qatarenergy) March 18, 2026
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్ను కూడా మూసివేయవలసి వచ్చింది. ఈ ప్లాంట్ రోజుకు సుమారు 6.1 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది యూఏఈ చమురు అవసరాలలో సుమారు 60 శాతాన్ని తీరుస్తుంది. ఈ గ్యాస్ను విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, నీటిని శుద్ధి చేయడానికి, పెద్ద పరిశ్రమలకు శక్తిని అందించడానికి ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో కూడా దాడులకు ప్రయత్నాలు జరిగాయి. రియాద్ వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. తూర్పు ప్రాంతంలోని రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు జరిపారు. రాస్ తానూరా అనే ఈ పెద్ద రిఫైనరీ రోజుకు సుమారు 5,50,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది. అనేక దేశాలకు గ్యాసోలిన్, డీజిల్, ఇతర ఇంధనాలను సరఫరా చేస్తుంది.
ఈ దాడుల తరువాత, ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు 112 డాలర్లకు పైగా పెరిగాయి. అమెరికాలో డీజిల్ ధరలు గ్యాలన్కు 5 డాలర్లకు పైగా పెరిగాయి. ఇది 2022 తర్వాత అత్యధికం. యూరప్లో గ్యాస్ ధరలు దాదాపు 70 శాతం పెరగగా, ఆసియాలో LNG ధరలు సుమారు 88 శాతం పెరిగాయి. ఈ దాడుల ప్రభావం ఈ దేశాలకే పరిమితం కాలేదు. చైనా, భారతదేశం, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ గ్యాస్ సరఫరాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
భారతదేశం తన గ్యాస్ అవసరాలలో అధిక భాగాన్ని ఖతార్ నుండి పొందుతుంది. కాబట్టి ఈ సంక్షోభ ప్రభావం ఇక్కడ కూడా పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అనేక దేశాలలో గ్యాస్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో కేవలం 9 నుండి 11 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే వారికి ఇతర మార్గాలు కూడా తక్కువగా ఉన్నాయి.
ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలు కేవలం స్థానిక కర్మాగారాలు మాత్రమే కాదు, ప్రపంచ ఇంధన సరఫరాకు ప్రధాన కేంద్రాలు. వాటిపై దాడి చేయడం అంటే, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం, ప్రతి పరిశ్రమ, ప్రతి వ్యక్తిపై పడుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే, ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..