మళ్లీ రణరంగంగా మారిన హోర్ముజ్ జలసంధి.. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ కోసం కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయింది అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఇరాన్పై అమెరికా మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతను కాపాడడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ కోసం కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం ముగిసిపోయింది అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే, ఇరాన్పై అమెరికా మరోసారి భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల భద్రతను కాపాడడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించింది. మంగళవారం (జూలై 07) హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు సరుకు రవాణా నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.
బుధవారం (జూలై 08) జరిగిన తాజా దాడులు ఇరాన్ దక్షిణ తీరంలోని బందర్ అబ్బాస్, చబహార్, కొనార్క్ తదితర కీలక నగరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. చబహార్లోని సముద్ర ట్రాఫిక్ నియంత్రణ టవర్ దెబ్బతినగా, నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. అనంతరం విద్యుత్ను పునరుద్ధరించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఆగ్నేయ ఇరాన్లోని ఇరాన్షహర్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక అగ్నిమాపక సిబ్బంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఉత్తర ఇరాన్లోని అఖాలా సమీప రైల్వే వంతెనపై కూడా అమెరికా దాడి చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
“హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే లక్ష్యం” అని సెంట్కామ్ వెల్లడించింది. ట్రంప్ కూడా ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ, “ఇది ఇరాన్ చర్యలకు ప్రతీకారం. మళ్లీ ఇటువంటి దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తాం” అని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ అత్యున్నత భద్రతా వ్యవస్థకు అనుబంధంగా ఉన్న నూర్న్యూస్, అమెరికా స్థావరాలపై త్వరలోనే భారీ ప్రతీకార దాడులు జరుగుతాయని సైనిక వర్గాల సమాచారాన్ని ప్రచురించింది. సుప్రీం లీడర్కు సీనియర్ సలహాదారుడు మొహ్సెన్ రెజాయీ కూడా దురాక్రమణదారులకు కఠినమైన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
జూన్ 17న కుదిరిన యుద్ధ విరమణ అవగాహన ఒప్పందాన్ని శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చే అవకాశాలు ఈ పరిణామాలతో దాదాపు దెబ్బతిన్నాయి. నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, “ఆ ఒప్పందం ముగిసిపోయిందని భావిస్తున్నాను. ఇరాన్తో ఇక వ్యవహరించాలని అనుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు. అయితే పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని తాను భావించడం లేదని, పరిస్థితులు త్వరలోనే అదుపులోకి వస్తాయని కూడా చెప్పారు.
ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్పైనా కనిపించింది. సెటిల్మెంట్ అనంతర ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు ఒక డాలర్కు పైగా పెరిగి 79.28 డాలర్లకు చేరుకుంది. ఇదే సమయంలో, అమెరికా దాడులు అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపించిన ఇరాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అధికారిక ఫిర్యాదు చేసింది. అలాగే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు, బాబ్-ఎల్-మండేబ్ జలసంధిలో నౌకా రాకపోకలపై చర్యలు వంటి ప్రతిస్పందనలను కూడా పరిశీలిస్తున్నట్లు ఇరాన్ సంకేతాలు ఇచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
