Ali Khamenei: ట్రంప్ వార్నింగ్ తర్వాత.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన నిర్ణయం!
ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ "జియోనిస్ట్ పాలన"పై దాడి చేస్తూ యుద్ధ హెచ్చరిక జారీ చేశారు. బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరించిన తర్వాత ప్రతిస్పందనగా ఈ హెచ్చరిక వచ్చింది. ఖమేనీ కీలక అధికారాలను ఇరాన్ మిలిటరీకి అప్పగించి, భూగర్భ బంకర్కు తరలిపోయారు.

ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ‘ఉగ్రవాద జియోనిస్ట్ పాలన’కి హెచ్చరిక జారీ చేస్తూ.. “యుద్ధం ప్రారంభమవుతుంది” అని అన్నారు. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవాలని’ పిలుపునిచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు కొన్ని గంటల తర్వాత ఖమేనీ నుంచి పోస్ట్ వచ్చింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం సమయంలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఎక్కడ దాక్కున్నాడో అమెరికాకు తెలుసు కానీ ఇప్పుడు ఆయనను చంపాలని అనుకోవడం లేదంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల తర్వాత ఖమేనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కీలక అధికారాలను ఇరాన్ మిలిటరీ సుప్రీం కౌన్సిల్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి అప్పగించారని తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ ఇజ్రాయెల్పై రెండు రౌండ్ల హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించిన కొద్దిసేపటికే ఖమేనీ నుంచి ఈ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. సుప్రీం లీడర్ ఖమేనీని ఈశాన్య టెహ్రాన్లోని భూగర్భ బంకర్కు తరలించినట్లు ఇరాన్ ఇన్సైట్ నివేదికలు వచ్చిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఆయనతో పాటు ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీతో సహా సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని భావిస్తున్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం బుధవారం ఆరో రోజు కూడా కొనసాగింది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చినప్పటికీ, రెండు దేశాలు ఒకదానికొకటి కొత్త క్షిపణి దాడులను ప్రారంభించాయి. ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం.. ఇరాన్ తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైపు రెండు క్షిపణుల తరంగాలను ప్రయోగించింది. టెల్ అవీవ్ పై పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో G7 శిఖరాగ్ర సమావేశం మధ్యలోనే ట్రంప్ అమెరికాకు తిరిగి వచ్చేశారు. పరిస్థితిని అంచనా వేయడానికి మంగళవారం మధ్యాహ్నం తన జాతీయ భద్రతా మండలితో 90 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. సమావేశం తర్వాత ట్రూత్ సోషల్లో వరుసగా బెదిరింపు పోస్టులు చేశారు ట్రంప్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి