AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ మెడికో దారుణ హత్య.. ఒళ్లంతా గాయాల వెనుక భయంకర నిజాలు!

ఉజ్బెకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని సవరీయ బసంత్ అనుమానాస్పద స్థితిలో మరణించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తోటి సహవిద్యార్థి జరిపిన దాడిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. అయిన్నప్పటికీ, ఈ హత్య వెనుక తీవ్రమైన కుట్ర దాగి ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఉజ్బెకిస్తాన్‌లో భారతీయ మెడికో దారుణ హత్య.. ఒళ్లంతా గాయాల వెనుక భయంకర నిజాలు!
Kerala Student Killed By Classmate In Uzbekistan
Balaraju Goud
|

Updated on: Jul 10, 2026 | 3:21 PM

Share

ఉజ్బెకిస్తాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న కేరళకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని సవరీయ బసంత్ అనుమానాస్పద స్థితిలో మరణించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తోటి సహవిద్యార్థి జరిపిన దాడిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. అయిన్నప్పటికీ, ఈ హత్య వెనుక తీవ్రమైన కుట్ర దాగి ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన సదరుల్ అనామ్ అనే సహ విద్యార్థి, సవరీయ బసంత్‌ల మధ్య జరిగిన ఒక వాగ్వాదం ఈ ఘోరానికి దారితీసిందని ప్రాథమిక సమాచారం. గొడవ జరుగుతున్న సమయంలో నిందితుడు ఆమె తలపై బలంగా కొట్టడం వల్లే ఆమె మృతి చెందినట్లు మొదట భావించారు. అయితే, సవరీయ మృతదేహాన్ని కేరళకు తీసుకువచ్చిన తర్వాత అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె శరీరంపై తల నుండి కాలి వేళ్ల వరకు అనేక చోట్ల తీవ్రమైన గాయాల గుర్తులు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌తో ఒక్క నిమిషంలో జరిగిన దాడి కాదని, ఆమెపై సుదీర్ఘ సమయం పాటు విచక్షణారహితంగా పశువులా దాడి చేసి చంపేశారని ఉజ్బెకిస్తాన్‌లోని దర్యాప్తు అధికారే స్వయంగా తమకు వెల్లడించారని సవరీయ మామ జనీష్ ఆరోపించారు.

ఈ దారుణ హత్య వెనుక మత మార్పిడి కోణం ఉందనే బలమైన అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సదరుల్ అనామ్ గత కొంతకాలంగా సవరీయపై మత మార్పిడి కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, ఆ విషయాన్ని హాస్టల్లోని కొందరు ఇతర విద్యార్థులు కూడా గమనించారని దర్యాప్తులో తేలింది. సవరీయ అందుకు స్పష్టంగా నిరాకరించడం వల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన భారత ఎంబసీ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాగా, సదరు మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు, విద్యార్థినులు ఒకే భవనంలో వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నట్లు తెలిసింది.

కూతురి మృతితో కోలుకోలేని ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు కేరళలోని అలప్పుజ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు బుధవారం (జూలై 08) హత్య కేసు నమోదు చేసి, ఇక్కడి ఆసుపత్రిలో రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ అంతర్జాతీయ హత్య కేసుపై కేరళలోనే పూర్తిస్థాయి విచారణ జరగాలని, చట్టపరమైన చర్యల కోసం నిందితుడిని ఉజ్బెకిస్తాన్ నుండి భారత్‌కు రప్పించాలని కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us