అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు.. ఓయూలోనే డిగ్రీ..

| Edited By: Jyothi Gadda

May 21, 2024 | 9:09 PM

జయ బాడిగ.. 1991 నుంచి 1994 వరకూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత.. అమెరికా వెళ్లిన ఆమె.. బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ విభాగంలో ఎంఏ, శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేసిన జయ బాడిగ.. పదేళ్లకు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌ చేశారు.

అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం.. తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు.. ఓయూలోనే డిగ్రీ..
Vijayawada Based Jaya Badig
Follow us on

ప్రపంచ దేశాల్లో మన తెలుగువాళ్లు సత్తా చాటుతూనే ఉన్నారు. అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం దక్కింది. తాజాగా.. విజయవాడకు చెందిన జయ బాడిగ అనే తెలుగు మహిళ.. అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దాంతో.. కాలిఫోర్నియాలో ఓ కోర్టు జడ్జిగా అపాయింట్‌ అయిన తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. అమెరికా కోర్టులో జడ్జిగా భారతీయ మహిళను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాడిగను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా బాడిగ జయ గుర్తింపు పొందారు.

కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె అయిన జయ ఉస్మానియా యూనివర్శిటీలో బిఏ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. విజయవాడలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన జయ బాడిగ.. 1991 నుంచి 1994 వరకూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత.. అమెరికా వెళ్లిన ఆమె.. బోస్టన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ విభాగంలో ఎంఏ, శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2009లో కాలిఫోర్నియా స్టేట్‌ బార్ ఎగ్జామ్ క్లియ‌ర్ చేసిన జయ బాడిగ.. పదేళ్లకు పైగా న్యాయ‌వాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

2018లో కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని అత్యవసర సేవల విభాగంలోనూ.. 2020లో కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్‌లో అటార్నీగా పనిచేశారు. 2022 నుంచి శాక్రమెంటో సుపీరియర్ కోర్టు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జి రాబర్ట్ లాఫమ్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో జడ్జిగా నియమితులయ్యారు జయ బాడిగ. ఇప్పటికే.. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో తెలుగు ప్రజలు కీలకమైన పదవులు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వారి సరసన జయ బాడిగ చేరారు. జయ బాడిగను పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక.. టీవీ9కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు జయ బాడిగ.