
ఉన్నత విద్యాబ్యాసం కోసం లండన్కు వెళ్లిన ఓరుగల్లు యువతి.. అక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా ఎన్నికయింది.. దీంతో అటు స్వగ్రామంతో పాటు మెట్టింటి గ్రామంలో సంబరాలు మిన్నంటుతున్నాయి.. ఆమె విజయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన పూజిత అనే మహిళ లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ వార్డ్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.. అత్తవారింటికి ఉన్న రాజకీయ నేపథ్యాన్ని లండన్ గడ్డపై చాటడంతో పుట్టింటి గ్రామంతో పాటు మెట్టింటి గ్రామంలో సంబరాలు జరుగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పూజిత ఆరున్నర ఏళ్ల క్రితం ఎం.ఎస్ చదవడం కోసం లండన్ కు వెళ్లారు.. ఎం.ఎస్ పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం సంపాదించారు.. లండన్ లోనే ఉద్యోగం చేస్తున్న పూజిత వరంగల్ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కడదూరి శ్రీనివాస్ ను వివాహం చేసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో వీరికి వివాహం జరిగింది.
లండన్ లో స్థిరపడ్డ శ్రీనివాస్ కుటుంబానికి ఓరుగల్లులో రాజకీయ నేపథ్యం ఉంది.. పూజిత అత్త సరోజన ఒంటి మామిడిపల్లి గ్రామ సర్పంచ్ గా పని చేశారు.. మామ కుమారస్వామి ఎంపీటీసీ గా పని చేశారు.. ప్రజాసేవ పట్ల ఈ కుటుంబానికి ఉన్న ప్రోత్సాహంతో పూజితను లండన్ లో కౌన్సిలర్ గా ఎన్నికయ్యేలా చేసింది.
ఇటీవల లండన్ లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పూజిత ప్రతిపక్ష పార్టీ “ద గ్రీన్ పార్టీ” నుంచి రాయల్ ఆల్బర్ట్ వార్డ్ కౌన్సిలర్ గా బరిలో నిలిచారు.. ఈ వార్డు నుండి మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేయగా పూజిత గెలుపొందారు.. ఈనెల 7వ తేదీన ఫలితాలు వెలువడగా పూజిత విజయం సాధించినట్లుగా ప్రకటించారు..
ఈ పదవీకాలం నాలుగు సంవత్సరాలు ఉంటుంది.. పూజిత విజయం పట్ల ఆమె పుట్టినిల్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు ఇటు మెట్టినిల్లు వరంగల్ జిల్లాలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో సంబరాలు మిన్నంటుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..