Uttarakhand’s Chamoli Glacier burst LIVE: ముంచేసిన మంచుకొండలు.. బురద నీటిలో 150 ప్రాణాలు.. కొట్టుకుపోయిన పవర్ ప్లాంట్..!

| Edited By: Balaraju Goud

Updated on: Feb 07, 2021 | 7:51 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని రేణి వద్ద హిమానీనదికి సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో సమీపంలోని డ్యామ్ కూడా కూలిపోయింది. ఈ ప్రకృతి వైపరిత్యంతో సమీపంలోని రేణీ గ్రామం జలసమాధి అయ్యింది.

Uttarakhand's Chamoli Glacier burst LIVE: ముంచేసిన మంచుకొండలు.. బురద నీటిలో 150 ప్రాణాలు.. కొట్టుకుపోయిన పవర్ ప్లాంట్..!

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పర్వత ప్రాంతాల్లోని మంచుచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. రైనీ తపోవన్‌ గ్రామం వద్ద ఉన్న పవర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి రైనీ వద్ద ఉన్న ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ ప్రకృతి వైపరిత్యంతో సమీపంలోని రేనీ గ్రామం జలసమాధి అయ్యింది. దీని ప్రభావంతో చమోలి నుంచి హరిద్వార్ వరకు ముప్పు ముంచుకురావడంతో అధికార బ‌ృందం అప్రమత్తమైంది. ఒక్కసారిగా నీటి ప్రవాహం చేరడంతో రుషిగంగా పవర్‌ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ విద్యుత్‌ కేంద్రంలో 150 మంది కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అలాగే, నదీ తీరంలో ఉన్న కొన్ని గ్రామాలు పూర్తిగా నీటి మునిగినట్లు సమాచారం. దీంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ పర్యటించి సహాయకచర్యలను పర్యవేక్షించారు. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చమోలీ జిల్లా కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండో-టిబెటన్‌ సరిహద్దు దళం పోలీసులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌.. పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కేబినెట్‌ సెక్రటేరియట్‌లో సహాయ చర్యల సమీక్ష నిమిత్తం కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ దళాల డీజీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొననున్నారు. సహాయక చర్యల నిమిత్తం రెండు ఎంఐ-17తో పాటు ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ చాపర్‌ను రంగంలోకి దింపినట్లు వాయుసేన అధికారులు తెలిపారు. అవసరమైతే మరిన్ని విమానాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ధౌలి నదిలో వరదలు వచ్చినట్లు సమాచారం అందుకున్న తరువాత జిల్లాలో హెచ్చరిక జారీ చేసినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తెహ్రీ శివ్ చరణ్ ద్వివేది తెలిపారు. దీనితో పాటు హరిద్వార్ జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరిక జారీ చేసింది. అన్ని పోలీస్‌స్టేషన్లు, నదీ తీరాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Feb 2021 07:51 PM (IST)

    మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారంః సీఎం రావత్

    గంగా నది వరద ఉధృతి కారణంగా చనిపోయిన వారి కుటంబాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మరోవైపు నీటి ప్రవాహం కట్టడి చేశామన్న సీఎం.. ఇక గ్రామాలకు, పవర్ ప్రాజెక్టుకు ముప్పు లేదని స్పష్టం చేశారు.

  • 07 Feb 2021 06:46 PM (IST)

    విచారం వ్యక్తం చేసిన సోనియాగాంధీ

    మరోవైపు జరిగిన ప్రమాద ఘటనపట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు విచారం వ్యక్తం చేశారు. ఈ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రమాదం పొంచి ఉండొచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

  • 07 Feb 2021 06:44 PM (IST)

    హెలీకాప్టర్లతో కొనసాగుతున్న రిస్య్కూ ఆపరేషన్

    వేలమంది ఆర్మీ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. కొండల్లో వాహనాల ద్వారా ప్రయాణం కష్టం కావడంతో హెలీకాప్టర్లను ఉపయోగించి భక్తులను, టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

  • 07 Feb 2021 06:40 PM (IST)

    10 మృతదేహాల వెలికితీత

    ప్రమాదం జరిగిన ప్రాంతంలో 16 మంది వరకు ఉద్యోగులు చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఐటీబీపీ డీజీ డీడీ దేశ్వాల్ వెల్లడించారు. నదీ ప్రవాహం నుంచి ఇప్పటి వరకు 10 మృతదేహాలను తమ సిబ్బంది వెలికి తీసినట్లు తాజాగా చేసిన ప్రకటనలో దేశ్వాల్ వెల్లడించారు.

  • 07 Feb 2021 06:18 PM (IST)

    వరదల్లో చిక్కుకున్నవారు క్షేమంగా బయటపడాలిః వెంకయ్య

    ఆకస్మిక వరదతో అల్లాడుతున్న ఉత్తరాఖండా రాష్ట్రానికి యావత్ దేశం అండగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వరదల్లో చిక్కుకున్నవారు క్షేమంగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వెంకయ్య ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  • 07 Feb 2021 06:13 PM (IST)

    టీమిండియా స్కోర్ బోర్డుకు జీవం పోసిన పంత్, పూజారా జోడీ

    పీకలలోతు కష్టాల్లో టీమిండియాకు పంత్, పూజారా జోడీ జీవం పోసింది. ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును ఈ ఇద్దరు దూకుడుగా ఆడి భారీ స్కోరును జోడించారు. కానీ.. అద్భంతగా కొనసాగుతున్న జోడీకి బ్రేక్ పడింది. పంత్, పుజారా ఒకరి తర్వాత ఒకరు ఔటయ్యారు. దీంతో పరుగులు పెడుతున్న టీమిండియా స్కోర్ బోర్డుకు బ్రేక్ పడింది.

  • 07 Feb 2021 06:09 PM (IST)

    కార్మికులను కాపాడిన ఐటీబీపీ బృందాలు

    పవర్ ప్రాజెక్టులో గల్లంతైన 150 మంది కార్మికుల్లో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించాయి. మరో 147 మంది కోసం తీవ్రంగా గాలింపును ముమ్మరం చేశారు. అటు.. తపోవన్ డ్యామ్ దగ్గర 16 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అయితే.. పవర్ ప్రాజెక్టులో గల్లంతయిన వారు మొత్తం మృతి చెంది ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ప్రాణాలతో బయటపడ్డ కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకువస్తోంది ఐటిబిపి రిస్య్కూ టీమ్.

  • 07 Feb 2021 05:08 PM (IST)

    క్షణాల్లోనే వరద ముంచుకొచ్చిందిః ప్రత్యక్ష సాక్షి

    చమోలీ ప్రాంతంలో ఆస‌క్మికంగా వచ్చిన వ‌ర‌ద సృష్టించిన బీభ‌త్సంపై ఓ ప్రత్యక్ష సాక్షి స్పందించాడు. అది చాలా వేగంగా వ‌చ్చిందని, ఎవ‌రినీ అప్రమత్తం చేసే పరిస్థితి దొర‌క‌లేద‌ని రేనీ గ్రామానికి చెందిన సంజ‌య్ సింగ్ అనే ఆ వ్యక్తి చెప్పాడు. ఈ వ‌ర‌ద‌లో తాము కూడా కొట్టుకుపోతామ‌నుకున్నామ‌ని అత‌డు చెప్పాడు.

  • 07 Feb 2021 04:48 PM (IST)

    సహాయకచర్యల్లో 7 నేవీ బృందాలు

    ఉత్తరాఖండ్ ప్రాంతంలో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏడు ఇండియన్ నేవీ బ‌ృందాలు రిస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని భారత నావికాదళ అధికారులు వెల్లడించారు.

  • 07 Feb 2021 04:44 PM (IST)

    ఉత్తరాఖండ్విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందిః ప్రధాని

    ఉత్తరాఖండ్ రాష్ట్రం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హల్దియా ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. చమోలీ ప్రాంత ప్రజలకు యావత్ దేశం అండగా ఉందన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయకచర్యలు చేపడుతున్నాయని ప్రధాని తెలిపారు.

  • 07 Feb 2021 04:27 PM (IST)

    సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐటిబిపి బృందం

    సహాయక చర్యల నిమిత్తం రెండు ఎంఐ-17తో పాటు ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ చాపర్‌ను రంగంలోకి దింపినట్లు వాయుసేన అధికారులు తెలిపారు. అవసరమైతే మరిన్ని విమానాలను పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు తపోవన్ డ్యామ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో 20 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సైట్ వద్ద మోహరించిన ఐటిబిపి బృందం సహాయక చర్యలను చేపడుతోంది.

  • 07 Feb 2021 04:17 PM (IST)

    టెహ్రీ డ్యామ్ నుంచి నీటి ప్రవాహం నిలిపివేత

    వరద పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ డ్యామ్ నుంచి ప్రవాహం ఆగిపోయింది. వరద ధాటికి చమోలీ ప్రాంతం మునిగిపోవడంతో నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

  • 07 Feb 2021 04:15 PM (IST)

    జలవిద్యుత్ ప్రాజెక్టులో కొంత భాగం దెబ్బతిన్నదిః ఎన్‌టీపీసీ

    ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సమీపంలో హిమపాతం కారణంగా నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులో కొంత భాగం దెబ్బతిన్నదని ఎన్‌టీపీసీ ప్రకటించింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడు, జిల్లా అధికారులతో , పోలీసుల సహాయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎన్‌టీపీసీ లిమిటెడ్ అధికారులు తెలిపారు.

  • 07 Feb 2021 04:05 PM (IST)

    గల్లంతైన వారికోసం గాలిస్తున్నాంః ఐటిబిపి డీజీ దేస్వాల్

    ఉత్తరాఖండ్‌లోని తపోవన్ డ్యామ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో 20 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సైట్ వద్ద మోహరించిన ఐటిబిపి బృందం సహాయక చర్యలను చేపడుతోంది. తప్పిపోయిన వ్యక్తులపై సమాచారాన్ని సేకరించడానికి మేము ఎన్‌టిపిసి నిర్వహణ బృందంతో సంప్రదిస్తున్నామని ఐటిబిపి డీజీ ఎస్ఎస్ దేస్వాల్ తెలిపారు.

  • 07 Feb 2021 04:02 PM (IST)

    ముంపు ప్రాంతాలకు వైద్య బృందాలుః సీఎం టీఎస్ రావత్

    వరద ముంపు ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను తరలించారు. ఈ అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి జోషిమత్ వద్ద 30 పడకల ఆసుపత్రిని ఉంచారు. శ్రీనగర్, రిషికేశ్, జాలీగ్రాంట్ మరియు డెహ్రాడూన్ లోని ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి మేము మా వంతు కృషి చేస్తున్నామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ తెలిపారు.

  • 07 Feb 2021 04:00 PM (IST)

    వాతావరణ శాఖ హెచ్చరిక

    2021 ఫిబ్రవరి 7, 8 తేదీలలో ఉత్తరాఖండ్‌లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే, పశ్చిమ ప్రాంతంలో ఏర్పడ్డ హిమపాతం ప్రభావంతో, ఫిబ్రవరి 9 సాయంత్రం ఫిబ్రవరి 10 సాయంత్రం ఉత్తరాఖండ్ ఉత్తర భాగంలో తేలికపాటి వర్షపాతం లేదా హిమపాతం సంభవించవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  • 07 Feb 2021 03:56 PM (IST)

    బీజేపీ కార్యకర్తలు సహాయకచర్యల్లో పాల్గొనండిః జేపీ నడ్డా

    బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఉత్తరాఖండ్ సిఎం టిఎస్ రావత్‌తో మాట్లాడి చమోలిలో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బిజెపి చీఫ్‌తో కూడా ఆయన మాట్లాడుతారు. ప్రోటోకాల్‌ను అనుసరించి రెస్క్యూ పనుల్లో బిజెపి కార్యకర్తలు తప్పక సహాయం చేయాలని నడ్డా పిలుపునిచ్చారు.

  • 07 Feb 2021 03:52 PM (IST)

    చమోలీ ఘటన బాధకరంః రాష్ట్రపతి

    చమోలీ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉత్తరాఖండ్ లోని జోషిమత్ సమీపంలో మంచు కొండ విరగడంతో ధౌలి గంగ నదీకి సంభవించిన వరదల వల్ల నష్టం వాటిల్లడం బాధకరమన్నారు. ప్రజల శ్రేయస్సు, వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్ కోవిద్ తెలిపారు. భారత సైన్యం ఆధ్వర్యంలో సహాయ, సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఏ ఒక్కరికి ప్రాణ నష్టం వాటిల్లకుండ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

  • 07 Feb 2021 03:45 PM (IST)

    కొట్టుకుపోయిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వంతెన

    జోషిమత్ ప్రాంతానికి ముందు మాలారి సమీపంలో ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వంతెన వరదలతో కొట్టుకుపోయింది. డైరెక్టర్ జనరల్ బిఆర్ఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి దీనిని సాధ్యమైనంత త్వరగా తిరిగి పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన సామాగ్రిని & సిబ్బందిని స్థానానికి తరలించాలని ఆయన తెలిపారు.

  • 07 Feb 2021 03:42 PM (IST)

    రేనీ గ్రామానికి ఉత్తరాఖండ్ సీఎం రావత్

    ముంపుకు గురైన తపోవన్ ప్రాంతంలోని రేనీ గ్రామానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేండ్ర సింగ్ రావత్ చేరుకున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

  • 07 Feb 2021 03:39 PM (IST)

    సురక్షిత ప్రాంతానికి 16మంది తరలింపు

    తపోవన్ డ్యామ్ వద్ద చిక్కుకున్న 16 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ ఆశోక్ కుమార్ తెలిపారు. మిగిలినవారి కోసం ప్రత్యేక బృందాలతో సహాయకచర్యలు చేపడుతున్నామన్నారు.

  • 07 Feb 2021 03:36 PM (IST)

    బీహార్ సర్కార్ అప్రమత్తంః నితీష్ కుమార్

    ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఫ్లాష్ వరదపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరాలను సేకరిస్తున్నామన్నారు. మా అధికారులు అక్కడి అధికారులతో సంప్రదిస్తున్నారు. ఇది గంగా నదికి సంబంధించింది కాబట్టి, మేము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు సీఎం నితీష్ కుమార్.

  • 07 Feb 2021 03:33 PM (IST)

    చమోలీ ఘటనపై అమిత్ షా ఆరా

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ఘటనపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌, ఎన్‌డీఆర్ఎఫ్ డీజీ ఎస్ఎన్ ప్రధాన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, ఐటీబీపీ డీజీ ఎస్ఎస్ దేశ్వాల్‌లతో మాట్లాడారు. వరద పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యలు ముమ్మరం చేయాలని అమిత్ షా ఆదేశించారు.

  • 07 Feb 2021 03:31 PM (IST)

    చమోలీ ఘటనపై ప్రధాని మోదీ సమీక్ష

    ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన వరదలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై తాను నిరంతరం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని అందరి క్షేమం, రక్షణ కోసం యావత్తు దేశం ప్రార్థిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులతో ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నట్లు తెలిపిన ప్రధాని.. ఎన్‌డీఆర్ఎఫ్ నిర్వహిస్తున్న సహాయ, పునరావాస కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు.

  • 07 Feb 2021 03:20 PM (IST)

    ముగ్గురి మృతదేహాలు వెలికితీత

    ఉత్తరాఖండ్‌లో భారీ మంచుకొండ విరిగిపడింది. దీంతో మంచు ఖండం కరగడంతో ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జోషి మఠ్‌లో ధౌలి గంగ నది వరదల్లో రుషి గంగ పవర్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. గాయపడిన కొందరిని కాపాడినట్లు చెప్పారు.

  • 07 Feb 2021 03:03 PM (IST)

    గ్లేషియర్‌ విరిగిపడడంతో ఉవ్వెత్తున మంచు కొండలు జారిపడ్డాయి. అవలాంచి కారణంగా అలకనంద, ధౌలిగంగ నదుల్లో ఒక్కసారిగా మెరుపు వరదలు ముంచెత్తాయి. ఈ వరద ప్రభావంలో చమోలి జిల్లాలోని రిషిగంగ విద్యుత్తు ప్రాజెక్టు చిక్కుకుంది. ఆకస్మాత్తుగా వచ్చిన వరద ధాటికి విద్యుత్ ప్లాంట్ నిర్మాణపనుల్లో ఉన్న 100-150 నిర్మాణ కూలీలు కొట్టుకుపోయి ఉంటారని ఉత్తరాఖండ్ అధికారులు భావిస్తున్నారు. దీంతో నదీతీర ప్రాంతాల్లోని విష్ణుప్రయాగ్, జోషీమఠ్, కర్ణ్ ప్రయాగ్, రుద్రప్రయాగ్, రిషికేష్, హరిద్వార్ కు హై-అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

  • 07 Feb 2021 02:58 PM (IST)

    తపోవన్ ప్రాంతంలో సిద్ధంగా ఉన్న ఆర్మీ

    ఉత్తరాఖండ్‌లోని చమోలిలోని తపోవన్ ప్రాంతంలోని రేని గ్రామంలో నాలుగు ఆర్మీ బృందాలు, రెండు వైద్య బృందాలు, ఒక ఇంజనీరింగ్ టాస్క్‌ఫోర్స్‌ సహాయకచర్యలు చేపడుతోంది. ప్రత్యేకించి ఆర్మీ హెలికాప్టర్లు వైమానిక ప్రదేశంలో సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యం తెలిపింది.

  • 07 Feb 2021 02:57 PM (IST)

    ఓ సొరంగంలో చిక్కుకున్న 16 మంది గుర్తింపు

    తపోవన్ ప్రాంతంలో ఒక సొరంగం లోపల చిక్కుకున్న 16 మందితో రెస్క్యూ బృందాలు గుర్తించాయి. వీరి రక్షించేందుకు ప్రత్యేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.

  • 07 Feb 2021 02:54 PM (IST)

    100 నుండి 150 మధ్య ప్రాణనష్టంః ఓం ప్రకాష్

    చమోలి సంఘటనపై ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ స్పందించారు. ఈ దుర్ఘటనలో దాదాపు 100 నుండి 150 మధ్య ప్రాణనష్టం ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఐటిబిపి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. సహాయకచర్యలు ముమ్మరం చేశామని ఓం ప్రకాష్ తెలిపారు.

  • 07 Feb 2021 02:45 PM (IST)

    అందరూ బాగుండాలిః పీయూష్ గోయల్

    ఉత్తరాఖండ్ వరదలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఏవరికి ఇబ్బంది వాటిల్లకూడదన్నారు. ఉత్తరాఖండ్‌లో మంచుకొండచరియలు విరిగిపోవడం, అందులో పౌర ప్రాణనష్టం వల్ల సంభవించిన విపత్తు చాలా విచారకరం. అపదలో ఉన్నవారికి సానుభూతి తెలియజేసిన మంత్రి.. అందరూ బాగుండాలని ఎవరికీ అపాయం కలిగించవద్దని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పియూష్ గోయల్ ట్వీట్ చేశారు. గాయపడినవారిని త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.

  • 07 Feb 2021 02:39 PM (IST)

    డెహ్రాడూన్‌కు ప్రత్యేక బృందాలు

    ఉత్తరాఖండ్ ముంపు ప్రాంతాలకు నాలుగు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను డెహ్రాడూన్‌కు విమానంలో పంపినట్లు అధికారులు తెలిపారు. జోషిమత్ చేరుకోవడానికి మరికొంత సమయంపడుతుందని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • 07 Feb 2021 02:35 PM (IST)

    పరిస్థితిని సమీక్షిస్తున్న ఆర్మీ

    రిషికేశ్ సమీపంలోని మిలిటరీ స్టేషన్ స్థానిక అధికారులతో కలిసి రెస్క్యూ & రిలీఫ్ ఆపరేషన్లలో పాల్గొంటుంది. భారత సైన్యం సుమారు 600 మంది సిబ్బంది వరద ప్రభావిత ప్రాంతాల వైపు కదులుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. జిల్లా అధికారుల సమన్వయంలో చురుకుగా పాల్గొంటుంది భారత సైన్య. ఆర్మీ ప్రధాన కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

  • 07 Feb 2021 02:33 PM (IST)

    రంగంలోకి దిగిన సైన్యం

    భారత సైన్యం వరద ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్‌కు మద్దతు ఇవ్వడానికి చాపర్స్ దళాలను నియమించింది.

  • 07 Feb 2021 02:19 PM (IST)

    కొనసాగుతోన్న వరద ఉధృతి

    అలకనంద నది సాధారణంకన్నా ఒక మీటరు అధిక ఎత్తులో ప్రవహిస్తోందని తెలిపారు ఉత్తరాఖండ్​ సీఎం రావత్. అయితే నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోందని చెప్పారు. మరోవైపు తపోవన్ డ్యామ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది.

  • 07 Feb 2021 01:45 PM (IST)

    ఆ ప్రాంతాలకు వెళ్లవద్దు.. అధికారులు సూచన

    విష్ణుప్రయాగ్, జోషిమత్, కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ ప్రాంతాల ప్రజలు నదీ తీరానికి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌రావత్‌ విచారం వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శిస్తానని ప్రకటించారు. పోలీసులు, విపత్తు నిర్వాహక బృందాలు ఇప్పటికే సహాయకచర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

  • 07 Feb 2021 01:43 PM (IST)

    ఘటన వివరాలను తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

    ఉత్తరాఖండ్​ ఘటన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్​ తెలిపారు. రెండు ఐటీబీపీ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. వాయుసేన చాపర్ సాయంతో మరో మూడు బృందాలు సాయంత్రం వరకు అక్కడకు వెళ్తాయని చెప్పారు.

  • 07 Feb 2021 01:43 PM (IST)

    ఈ ఘటనలో 100 నుంచి 150 మంది మరణించి ఉంటారు: సీఎస్ ఓం ప్రకాశ్

    ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడటం వల్ల పెను ప్రమాదం సంభవించింది. ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. ఈ ఘటనలో 100 నుంచి 150 మంది మరణించి ఉంటారని ఉత్తరాఖండ్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్​ చెప్పారు.

  • 07 Feb 2021 01:32 PM (IST)

    భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా

    పరిస్థితి తీవ్రంగానే ఉందని చమోలీ జిల్లాఎస్పీ తెలిపారు. అయితే, ఎంత నష్టం వాటిల్లిందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌.. పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • 07 Feb 2021 01:28 PM (IST)

    సహాయక చర్యల్లో ఇండో-టిబెటన్‌ సరిహద్దు దళం

    సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇండో-టిబెటన్‌ సరిహద్దు దళం పోలీసులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • 07 Feb 2021 01:26 PM (IST)

    వరదలో 150 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం

    రుషిగంగా పవర్‌ ప్రాజెక్టు దెబ్బతింది. ఈ విద్యుత్‌ కేంద్రంలో 150 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. అలాగే నదీ తీరంలో ఉన్న కొన్ని గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చమోలీ జిల్లా కలెక్టర్‌ హెచ్చరికలు జారీ చేశారు.

  • 07 Feb 2021 01:18 PM (IST)

    చమోలి నుంచి దిగువకు భారీగా వరద

    చమోలి నుంచి దిగువకు భారీగా ప్రవహిస్తోంది. చమోలి, కర్ణ ప్రయాగ్, రుద్ర ప్రయాగ్ ప్రాంతాల ప్రజలు నది తీరానికి దూరంగా వెళ్లిపోవాలని హెచచరికలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్తునట్లు తెలిపారు.

  • 07 Feb 2021 01:07 PM (IST)

    హెల్ప్‌లైన్ నంబర్ విడుదల

    ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని రేణి వద్ద హిమానీనదికి సంభవించిన వరదల కారణంగా తీవ్ర కలకలం చెలరేగింది. వదరనీరు సమీపంలోని రేణీ గ్రామాన్ని ముంచెత్తింది. అధికారులు ఎప్పుటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 1070 హెల్ప్‌లైన్ నంబర్ విడుదల చేశారు.

  • 07 Feb 2021 01:04 PM (IST)

    స్పాట్‌కు రెస్క్యూ బృందాలు

    మంచు కొండలు కరిగి దౌలిగంగా నదిలో ఒక్కసారిగా వరదలు పోటెత్తడం ఉత్తారాఖండ్‌లో కలకలం రేపింది. చమోలీ జిల్లా తపోవన్ ఏరియాలోని రేణి గ్రామం సమీపంలోగల ఓ విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో ఈ ఆకస్మిక విపత్తు తలెత్తింది. దీంతో రేణి గ్రామం వరద ప్రవాహంలో మునిగిపోయింది. ఎంతమంది గల్లంతయ్యారో తెలియరాడం లేదు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.

Published On - Feb 07,2021 7:51 PM

Follow us
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
వామ్మో..! గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. 13మంది అరెస్ట్
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
ఈ ఒక్కపని చేస్తే చాలు.. గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతుంది
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
పరేషాన్ చేయకే మల్లన్న.. కొంపముంచిన ఈటలతో సరదా..
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆ నిర్మాత వేధించాడు, బెదిరించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నటి
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో భారత ఆటగాళ్లదే ఆధిపత్యం..
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి
ఇంటి అద్దె భత్యాన్ని క్లెయిమ్ చేస్తే ఈ తప్పు చేయకండి