Viral: వితంతువుల గ్రామం.. పెళ్లయిన కొద్ది రోజులకే చనిపోతున్న మగవారు.. మిస్టరీ ఏంటంటే
ఈ గ్రామంలో ఎక్కడ చూసినా వితంతువులే కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ పురుషులు పెళ్లయిన కొద్ది రోజులకే చనిపోతారు. ఇది ఏదో శాపగ్రస్త గ్రామమని మీరు అనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ఇక్కడ పురుషులు చిన్నవయసులో చనిపోవడానికి బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి...
రాజస్థాన్లోని బుండి జిల్లాలోని బుధాపురా గ్రామాన్ని వితంతువు గ్రామం అని కూడా అంటారు. అందుకు కారణం, ఈ గ్రామంలో నివసించే చాలా మంది స్త్రీలు వితంతువులు అవ్వడమే. పెళ్లయిన కొద్ది రోజులకే ఇక్కడి మహిళల భర్తలు చనిపోవడంతో చాలా మంది మహిళలు చిన్న వయసులోనే వితంతువులయ్యారు. అలా అని ఇదేదో శాపగ్రస్త గ్రామమని మీరు అనుకుంటే, తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ పురుషులు చిన్నవయసులో చనిపోవడానికి బలమైన కారణం ఉంది.
సిలికోసిస్ వ్యాధి:
అనేక పరిశోధనల తర్వాత.. ఇక్కడ పురుషులు సిలికోసిస్ అనే వ్యాధితో మరణిస్తున్నారని వెల్లడైంది. సిలికోసిస్ అనేది వృత్తి సంబంధ శ్వాసకోశ వ్యాధి. స్ఫటికాకార సిలికా ధూళి వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధి. ఈ వ్యాధిలో ఊపిరితిత్తులు వాచి గట్టిపడతాయి. సిలికోసిస్ అకస్మాత్తుగా వచ్చినప్పుడు న్యుమోనియా వలె ఆయాసం, జ్వరం, శరీరం నీలంగా మారడం జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చినవారిలో నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం, బలహీనత, అలసట, కొంతమంది చివరికి నడవడం లేదా మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం మానేస్తే (శ్వాసకోశ వైఫల్యం) చివరికి ప్రాణాంతకం కావచ్చు. నిజానికి బుధాపురాలో ఎక్కువ మంది పురుషులు గనుల్లో పని చేస్తుంటారు. గనుల్లో పనిచేసే వారికి ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి వస్తుంది. ఈ గ్రామంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక చాలామంది మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అలా అని ఆ పనికి వెళ్లకుండా ఉందామంటే.. మరో ఉపాధి దొరకడం కష్టంగా ఉందంటున్నారు.
ఈ గ్రామంలో ఉన్న చాలామంది వితంతువులు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదంటున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో భర్త చనిపోయిన తర్వాత కూడా ఇక్కడి మహిళలంతా గనుల్లో పని చేస్తూ పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వారినీ అదే జబ్బు వెంటాడుతుంది. ఈ గనుల్లో ఇసుకరాయిని పగలగొట్టే పని చాలా గంటలపాటు జరుగుతుంది. ఈ రాళ్లను చెక్కేటప్పుడు వెలువడే ధూళి వల్ల కార్మికుల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. మంచి చికిత్స వారి ప్రాణాలను నిలబెడుతుంది. లేదంటే మరణం ఖాయం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..