AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..

ముంబైలోని ఓ మెట్రో స్టేషన్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నిత్యం దద్దీగా ఉండే స్టేషన్‌లో సడెన్‌గా ఓ పాము ప్రత్యక్షమైంది. పామును చూసిన ప్రయాణికులు ఒక్కాసరిగా భయాందోళనకు గురయ్యారు. అటూ ఇటూ పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అటవీశాఖ అధికారుల సహాయంతో పామును పట్టేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..
Mumbai Metro Snake
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 12:47 PM

Share

ముంబై నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఆక్వా మెట్రో లైన్-3 స్టేషన్‌లో దేశంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటిగా గుర్తింపు పొందిన రస్సెల్స్ వైపర్ ప్రత్యక్షమవడంతో కొంతసేపు కలకలం రేగింది. సాధారణంగా అడవులు, పొదలు, వ్యవసాయ భూముల్లో కనిపించే ఈ ప్రమాదకరమైన పాము నగర నడిబొడ్డున ఉన్న అత్యాధునిక మెట్రో స్టేషన్ బేస్‌మెంట్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బేస్‌మెంట్-2 ప్రాంతంలో అనుమానాస్పదంగా కదులుతున్న ఒక పెద్ద పామును గమనించారు. మొదట అది సాధారణ పాము అయి ఉండవచ్చని భావించిన సిబ్బంది దగ్గరగా పరిశీలించగా, అది రస్సెల్స్ వైపర్ అని గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మెట్రో సిబ్బంది ఆ ప్రాంతంలో అనవసర రాకపోకలను నిలిపివేసి అటవీశాఖతో పాటు రెస్క్యూ బృందాలకు సమాచారం అందించారు.

కొద్ది సేపటికే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ప్రత్యేక పరికరాల సహాయంతో పామును సురక్షితంగా పట్టుకున్నారు. విషపూరిత పాము కావడంతో రెస్క్యూ బృందం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. ఎట్టకేలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పామును విజయవంతంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనతో మెట్రో స్టేషన్‌లో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే అధికారులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు స్పష్టం చేశారు.

దేశంలోనే ప్రమాదక పాముల్లో ఒకటి

రస్సెల్స్ వైపర్ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషపూరిత పాముల్లో ఒకటి. దీని కాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం, ఈ పాము విషం రక్త గడ్డకట్టే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అంతర్గత రక్తస్రావాలకు కారణమవుతుంది. అందుకే ఈ జాతి పామును అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us