Viral: నదిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా మహిళకు కనిపించిన 100 ఏళ్ల నాటి సీసా.. దాని లోపల
సాధారణమైన డైవ్ ఒక అద్భుతమైన అనుభూతిగా మారింది. అమెరికాలోని మిషిగన్లో చెబోయ్గన్ నదిలో స్కూబా డైవర్ జెనిఫర్ డౌకర్కి దాదాపు వందేళ్ల నాటి సీసాలో రాసిన సందేశం దొరికింది. 1926లో రాసిన ఆ చీటి, ఆశ్చర్యకరంగా ఇప్పుడు బయటపడింది. ఇంతకీ అందులో ఏం రాసి ఉందంటే..?

రోజూ చేసే పనులు ఒక్కోసారి ఊహించని అనుభవాలుగా మారిపోతాయి. ఓ పుస్తకంలో దాచిన చీటీ, బాల్యంలో ముద్దుగా చూసుకున్న ఆటబొమ్మ, ఆల్మరాలో దొరికిన పాత లేఖ.. ఇలా సాధారణమైన చోట్ల అసాధారణమైన కథలు దాగి ఉంటాయి. అలాంటిదే ఒక అనుభవం మిచిగన్ రాష్ట్రానికి చెందిన స్కూబా డైవర్ జెన్నిఫర్ డౌకర్కు ఎదురైంది. తన గ్లాస్ బాటమ్ బోటును శుభ్రం చేస్తూ, షిబాయగన్ నదిలో డైవ్ చేసిన జెన్నిఫర్కి ఒక పచ్చ బాటిల్ కనిపించింది. మొదట అది సాధారణ బాటిల్ అనుకుంది. దగ్గరగా వెళ్లి తీసుకున్నాక లోపల పేపర్ కనిపించడంతో ఆశ్చర్యపోయింది. జాగ్రత్తగా బయటికి తీసి చదివితే.. అది 1926 నవంబర్లో రాసిన లేఖ అని తెలిసింది. “ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే, దాన్ని చెబోయగన్లోని జార్జ్ మోరోకు తిరిగి ఇవ్వండి. ఎక్కడ దొరికిందో కూడా చెప్పండి” అని ఆ లేఖలో రాసి ఉంది.

ఈ ఆశ్చర్యకర ఘటనతో థ్రిల్ ఫీల్ అయిన జెన్నిఫర్, ఫేస్బుక్లో ఫోటోలు షేర్ చేసింది. ఒక్కరోజులోనే ఆ పోస్ట్ వైరల్ అయి, లక్షలాది షేర్లు, కామెంట్లు వచ్చాయి. ఆ లేఖ ఎవరు రాసారో వెతకడం మొదలైంది. అంతలోనే జెన్నిఫర్కి ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది మిచెల్ ప్రిమో. లేఖ రాసిన జార్జ్ మోరో కూతురు. ఆమె తండ్రి హ్యాండ్రైటింగ్ అని వెంటనే గుర్తుపట్టింది. లేఖ ఆమె పుట్టకముందే రాసినది అయినా.. వెంటనే గుర్తించగలిగింది. జెన్నిఫర్ ఆ బాటిల్, లేఖను మిచెల్కు తిరిగి ఇవ్వాలని అనుకుంది. అయితే, మిచెల్ మాత్రం ఆ లేఖను జెన్నిఫర్ వద్దే ఉంచుకోవాలని సూచించింది. అందరికీ గుర్తుండేలా బోటులో ప్రదర్శనగా పెట్టమని కోరింది. దాంతో జెన్నిఫర్ ఆ బాటిల్, లేఖను ఫ్రేమ్ చేసి తన ఆఫీస్లో అమర్చింది.
అలా… ఓ సాధారణ డైవ్ ఒక 100 ఏళ్ల క్రితం రాసిన మెసేజ్ను వెలుగులోకి తెచ్చింది. ఒక బాటిల్లోని చిన్న లేఖ, రెండు కుటుంబాలను కలిపింది. సాధారణమైన సందేశం కూడా ఎంత పెద్ద కథ చెబుతుందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
