నేపాల్ ప్రళయంలో దివ్యాస్త్రం.. 21 మంది ప్రాణాలు కాపాడిన చీర
విశ్వాసం అనండి, అదృష్టం అనండి, అద్భుతం అనుకోండి.. కానీ, దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందం ఒక చీర సహాయంతో నేపాల్లోని భయానక వరదల నుండి ప్రాణాలతో బయటపడ్డారు. వారందరూ కైలాస పర్వతం, మానస సరోవరం యాత్ర చేయడానికి, దేవుడిని వెతుకుతూ హిమాలయాలకు ప్రయాణించారు. కానీ కొద్దిసేపటికే నీరు, బురద, బండరాళ్లతో కూడిన ఒక గోడ వారి వైపు దూసుకురావడంతో, వారు ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ బృందంలో అధికశాతం మంది వయసు పైబడిన యాత్రికులే ఉన్నారు. వారికి పర్వతం ఎక్కడం గానీ, పరుగెత్తడం గానీ సాధారణ విషయం కాదు, కానీ ఆ తర్వాతి కొన్ని నిమిషాలు ప్రాణాల కోసం చేసే పోరాటంగా మారాయి. అక్కడ రోడ్డు లేదు, ఎక్కడానికి కేవలం బురద మాత్రమే ఉంది. దగ్గరలో సహాయక బృందం లేదు, ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఆ తర్వాత ఒక చీర వారికి దేవుడుగా, వారి రక్షకుడిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నేపాల్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. ఈ భయానక విపత్తులో తమిళనాడుకు చెందిన 21 మంది భక్తుల బృందం చావు నోట్లో తలపెట్టి ప్రాణాలతో తిరిగొచ్చింది. మానససరోవర యాత్రకు వెళ్లిన ఈ బృందాన్ని ఒక సాధారణ చీర రక్షణ తాడులా మారి ప్రాణాపాయం నుండి కాపాడింది.
తమిళనాడుకు చెందిన 57 మంది యాత్రికులు మూడు బస్సుల్లో కైలాస మానససరోవర్ యాత్రలో భాగంగా నేపాల్లోని రసువా జిల్లా మీదుగా చైనా సరిహద్దు వైపు ప్రయాణిస్తున్నారు. సరిహద్దు చెక్పోస్ట్ సమీపంలో వర్షాల వల్ల రోడ్డుపై బురద పేరుకుపోవడంతో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాసేపు నిలిచిపోయింది. అంతలోనే ఊహించని విధంగా బాంబు పేలినంత పెద్ద శబ్దంతో పర్వతం పైనుంచి భారీ రాళ్లు, నీరు, బురద ఉధృతంగా విరుచుకుపడ్డాయి. బస్సు వెనకాలే ఉన్న లోయలోకి నీరు నిండిపోవడంతో, డ్రైవర్ హెచ్చరికతో యాత్రికులు వెంటనే వాహనం దిగి పైకి పరుగెత్తడం ప్రారంభించారు.
బాధిత యాత్రికులలో ఎక్కువమంది 50 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలంటే ఒక అంతస్తు ఎత్తు ఉన్న జారే బురద కొండను ఎక్కాల్సి వచ్చింది. అడుగు ముందుకు వేస్తే నాలుగడుగులు కిందకు జారిపోతున్న ఆ పరిస్థితిలో, ముందే పైకి చేరుకున్న పూంగొడి, రత్నకుమార్ దంపతులు, ఇతర సభ్యులు ఒక ఉపాయం చేశారు. పూంగొడి తన చీరను తీసి కిందికి వేలాడదీశారు.
కింద ఉన్న యాత్రికులు ఆ చీరను, అక్కడ ఉన్న ఒక కేబుల్ వైరును గట్టిగా పట్టుకుని కొండపైకి పాకుతూ ఎక్కారు. అసలు నడవలేని ఒక మహిళ నడుముకు చీరను కట్టి, పైన ఉన్న సభ్యులంతా కలిసి ఆమెను పైకి లాగారు. ఇలా దాదాపు గంటన్నర పాటు శ్రమించి 21 మంది సురక్షితంగా పైకి చేరుకున్నారు.
కొండపైన ఉన్న ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్నకు చేరుకున్న ఈ బృందానికి స్థానికులు నీరు, బిస్కెట్లు అందించారు. రెండు రోజుల పాటు కొండ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందుల మధ్య గడిపిన వీరు, భారత రాయబార కార్యాలయం, తమిళనాడు ప్రభుత్వ సమన్వయంతో హెలికాప్టర్ ద్వారా కాఠ్మాండూకు చేరుకుని, అక్కడ నుండి సురక్షితంగా చెన్నై చేరుకున్నారు.
సాధారణంగా సాంప్రదాయ దుస్తులుగా భావించే ఒక చీర, విపత్తు సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ తాడుగా మారి 21 కుటుంబాల్లో వెలుగులు నింపడం నిజంగానే ఒక అద్భుతం.




