Viral: మోకాలి పుండ్లు, తీవ్రమైన వాంతులతో ఆస్పత్రికి మహిళ – టెస్టులు చేయగా.. కడుపులో 10 కేజీల
ఆమెకు ఏడాదిన్నరగా కడుపు నొప్పి తగ్గడం లేదు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో.. స్థానికంగా మెడిసిన్ తెచ్చి వాడుతోంది. అయితే ఆమె పొట్ట వాపు రోజురోజుకు పెరిగిపోతుంది. మరోవైపు బరువు ఏమో తగ్గిపోతుంది. దానికి తోడు మోకాలికి పుండ్లు పడ్డాయి.. ఇంకా వాంతులు కూడా మొదలయ్యాయి...

ముంబైలోని సెంట్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళకు ప్రాణం పోశారు. ఈ ఏడాది మేలో మీనా అనే మహిళ తీవ్రమైన మోకాలి పుండ్లు, వాంతులతో ఆస్పత్రికి వచ్చింది. ఆరు రోజుల పాటు ఆమె తిన్నదంతా వాంతులతో వెలుపలకి పోయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మీనా స్థానిక వైద్యుల మీద ఆధారపడాల్సి వచ్చింది. చివరికి ఆమె సోదరుడు.. ఒక సామాజిక కార్యకర్త సహాయంతో సెంట్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితురాలు ఏడాదిన్నరగా తీవ్రమైన కడుపు నొప్పితో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు తెలుసుకున్నారు. ఇంకా వివరాలు కోరగా.. “ఒకసారి పొరపాటున టేబుల్ను ఢీకొట్టాక నొప్పి మొదలైంది. దాన్ని నేను పట్టించుకోలేదు. కానీ, అది క్రమంగా ఎక్కువై.. కడుపు భాగంలో బాగా వాపు వచ్చింది” అని ఆమె చెప్పారు. 36 ఏళ్ల వయసులోనే ఆమె రుతుస్రావం ఆగిపోగా, బరువు కూడా గణనీయంగా తగ్గిపోయింది. “నాకు ఆరుగురు పిల్లలను మోస్తున్నట్టు అనిపించేది. నా పరిస్థితిని చూసి పొరుగువారు భయపడిపోయేవారు” అని మీనా వెల్లడించింది.
దీంతో పరీక్షలు చేయగా 40 ఏళ్ల బాధితురాలి పొట్టలో 10.4 కిలోల భారీ కణితి ఉన్నట్లు గుర్తించారు. మీనా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించి.. ఆసుపత్రికి చేరుకున్న సమయంలో ఆమె బరువు కేవలం 20 కిలోలే. మీనాకు పొట్టలో కణితి ముఖ్యమైన అవయవాలైన లివర్, ప్లీహా, ప్రేగులు వంటివాటికి అంటిపెట్టుకుని ఉందని తేలింది. కణితి పొట్ట మొత్తం వ్యాపించి శ్వాస కూడా ఇబ్బందిగా మారేలా చేసింది. మీనా చాలా బలహీనంగా ఉండటంతో.. శస్త్రచికిత్స చాలా ప్రమాదకరంగా మారింది. కానీ ఆసుపత్రి వైద్య బృందం ఈ కేసును సవాల్గా స్వీకరించి ముందకు సాగింది. డాక్టర్ కొరేష్ (ఆంకాలజిస్ట్), డాక్టర్ శుభాంగి (మహిళా ఆరోగ్య నిపుణులు), డాక్టర్ పౌర్ణిమ సోన్కంబ్లే, డాక్టర్ రుచి (నొప్పి నివారణ నిపుణులు) నేతృత్వంలోని టీమ్ నాలుగు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించింది. కణితిని పూర్తిగా తొలగించి శస్త్రచికిత్స విజయవంతం చేశారు.
శస్త్రచికిత్స అనంతరం మీనాను ఐసీయూలో ఉంచి ప్రత్యేకమైన పర్యవేక్షణ చేశారు. ప్రస్తుతం ఆమె సాధారణ వార్డులో ఉన్నారు. ప్రోటీన్తో కూడిన ఆహారం అందిస్తూ, మెల్లగా శక్తిని తిరిగి పొందేలా వైద్యులు చర్యలు తీసుకుంటున్నారు. మీనా ఇప్పుడు క్రమంగా నడవడం ప్రారంభించి.. క్రమక్రమంగా కోలుకుంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
