రూ.1.48కోట్ల వజ్రాన్ని అక్కడెలా దాచావ్రా సామీ.. వీడు చేసిన పని తెలిస్తే అవాక్కే..
సింగపూర్లో సినిమా ఫక్కీలో అత్యంత ఖరీదైన డైమండ్ను దొంగిలించేందుకు యత్నించిన ఇద్దరు భారతీయ పర్యాటకుల ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. నకిలీ వజ్రాన్ని నోట్లో దాచుకుని, అసలు వజ్రంతో మార్చేసి పారిపోవాలని చూసిన కేసులో ప్రధాన నిందితుడికి సింగపూర్ కోర్టు రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సింగపూర్లో ఇద్దరు భారతీయ పర్యాటకులు సినీ ఫక్కీలో కోట్ల రూపాయల విలువైన వజ్రాలను దొంగిలించారు. వారిలో ఒకడు మేనేజర్తో మాట్లాడుతూ అతని దృష్టి మరల్చగా, మరొకడు అసలు వజ్రాన్ని తీసివేసి, దాని స్థానంలో తన నోటిలో దాచిన నకిలీ వజ్రాన్ని పెట్టాడు. ఈ జిత్తులమారి దొంగలు ఎలా పట్టుబడ్డారు.. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్దాం..
భారత్లోనే వ్యూహం సిద్ధం!:
గుజరాత్కు చెందిన మంగ్రోలియా మనోజ్కుమార్ గుర్జీభాయ్ (41), సెరాసియా మిలన్ రమ్నిక్ భాయ్ (30) అనే ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి ముందే పక్కా ప్లాన్ వేశారు. సింగపూర్లోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్లో ఉన్న 4.95 క్యారెట్ల (సుమారు రూ. 1.48 కోట్ల విలువైన) వజ్రం సిరియల్ నంబర్, ఆకారం మ్యాచ్ అయ్యేలా సూరత్లోనే ఒక నకిలీ డూప్లికేట్ వజ్రాన్ని తయారు చేయించుకున్నారు. జూన్ 19న పర్యాటక వీసాపై సింగపూర్ చేరుకున్నారు.
నోటి ద్వారా డైమాండ్ స్వాప్!:
జూన్ 19న మధ్యాహ్నం చైనాటౌన్లోని డియానోచే జ్యువెలరీ షాప్కు వెళ్లిన వీరు, ఆ వజ్రాన్ని చూడాలని కోరారు. మనోజ్కుమార్ సేల్స్ మేనేజర్ను ఇతర నగలు చూపించమని అడుగుతూ దృష్టి మళ్లించాడు. ఇదే సమయంలో తన నోటిలో దాచుకున్న నకిలీ వజ్రాన్ని బయటకు తీసిన సెరాసియా మిలన్, క్షణాల్లో అసలు వజ్రాన్ని తన నోటిలోకి నెట్టేసి నకిలీదాన్ని అక్కడ ఉంచేశాడు. తర్వాత మళ్ళీ వచ్చి కొంటాం అని చెప్పి అక్కడి నుండి జారుకున్నారు.
సీసీటీవీ దృశ్యాలు, విమానాశ్రయంలో అరెస్ట్:
వారు వెళ్ళిన వెంటనే అనుమానం వచ్చిన షాప్ మేనేజర్, ప్రత్యేక యంత్రంతో పరిశీలించగా అది నకిలీ వజ్రమని తేలింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా దొంగతనం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు, అప్పటికే హోటల్ ఖాళీ చేసి ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యేందుకు చాంగి విమానాశ్రయం చేరిన నిందితులను రాత్రి ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అరెస్టు చేశారు. మిలన్ బ్యాగ్ నుంచి అసలు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జైలు శిక్ష ఖరారు:
నేరం రుజువు కావడంతో మంగ్రోలియా మనోజ్కుమార్కు 2 ఏళ్ల 2 నెలల 2 వారాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరొక నిందితుడు మిలన్ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ప్రణాళికాబద్ధంగా చేసిన ఈ అంతర్జాతీయ నేరంపై సింగపూర్ న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.




