Viral Video: వందే భారత్ సత్తా అంటే ఇదీ.. ట్రైన్ ఎక్కి బిత్తరపోయిన విదేశీ భామ.. వీడియో వైరల్..
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణికులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అయితే కేవలం వేగమే కాదు.. అంతర్జాతీయ స్థాయి పరిశుభ్రత, నాణ్యమైన ఆహారంతో ఈ రైళ్లు విదేశీయులను సైతం మెప్పిస్తున్నాయి. ప్రారంభంలో చూపించే హడావుడి ఆ తర్వాత ఉంటుందా.. ఉండదా? అని డౌట్తో ట్రైన్ ఎక్కిన ఓ విదేశీ ట్రావెలర్కు ఊహించని షాక్ తగిలింది.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వందేభారత్ రాకతో భారతీయ రైల్వే ముఖచిత్రమే మారిపోయిందని చెప్పొచ్చు. వేగంతో పాటు సరికొత్త హంగులతో అత్యాధునిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాల మధ్య వందేభారత్ రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే వందేభారత్లో స్లీపర్ రైళ్లు సైతం పట్టాలెక్కాయి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ స్లీపర్ రైలు ప్రారంభమై ఆరు నెలలు దాటినా.. దాని నిర్వహణ, పరిశుభ్రత ఏమాత్రం తగ్గలేదని ఓ విదేశీ ట్రావెలర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కామాఖ్య – హౌరా వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభోత్సవం సమయంలోనే సందర్శించిన అనుష, ఆరు నెలల తర్వాత రైలు పరిస్థితి ఎలా ఉందో స్వయంగా పరిశీలించేందుకు గౌహతి నుండి కోల్కతా వరకు ఒంటరిగా ప్రయాణించారు. ‘‘ఆరు నెలల రద్దీ తర్వాత రైలు చెత్తగా, మురికిగా తయారవుతుందని నేను భావించాను. ఆర్భాటంగా ప్రారంభించిన ఆరంభ శూరత్వమేనా..లేక నిజంగానే నాణ్యత కాపాడుతున్నారా అని చెక్ చేయడానికి ఈసారి ఫస్ట్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నాను. లోపలికి వెళ్లి చూడగానే నాకు షాక్ తగిలింది. క్యాబిన్ చాలా విశాలంగా, ఆధునికంగా, ఎంతో పరిశుభ్రతతో ఉంది’’ అని ఆమె ఆ వీడియో తెలిపారు.
క్లీన్గా బాత్రూమ్..
సాధారణంగా భారతీయ రైళ్లలో బాత్రూమ్ల పరిశుభ్రతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే వందే భారత్ స్లీపర్లోని షవర్ ఏరియాతో కూడిన బాత్రూమ్లు అత్యంత శుభ్రంగా ఉన్నాయని, తన ప్రయాణంలో ఇదే అతిపెద్ద వైబ్ చెక్ అని ఆమె కొనియాడారు. మొదటి రోజు ఎంత రుచికరమైన ఆహారాన్ని అందించారో, ఆరు నెలల తర్వాత కూడా అదే క్వాలిటీ, టేస్ట్ కొనసాగుతోందని ఆమె తెలిపారు.
నెటిజన్ల ఫిదా.. నెట్టింట ప్రశంసల జల్లు
అనుష షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో విపరీతంగా వ్యూస్ రావడమే కాకుండా భారతీయ రైల్వే సేవలను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘‘భారత ప్రభుత్వం తన వంతుగా అత్యుత్తమ సదుపాయాలు అందిస్తుంది. వాటిని శుభ్రంగా కాపాడుకోవడం పౌరులుగా మన బాధ్యత’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘‘భారతీయ రైల్వేలోని సానుకూల కోణాన్ని, మౌలిక వసతుల పురోగతిని ప్రపంచానికి చూపించినందుకు ధన్యవాదాలు’’ అని మరొకరు కామెంట్ చేశారు. వందే భారత్ రైళ్లు కేవలం వేగానికే కాకుండా అంతర్జాతీయ స్థాయి పరిశుభ్రత, సేవలకు కూడా ప్రతీకగా నిలుస్తున్నాయని ఈ విదేశీ ట్రావెలర్ అనుభవం మరోసారి రుజువు చేసింది.
వీడియో చూడండి..
View this post on Instagram
