
హైదరాబాద్ నగరంలోని చాదర్ఘాట్ వంతెనపై ఓ ఆటోరిక్షాలో చోటుచేసుకున్న విచిత్రమైన, ప్రమాదకరమైన దృశ్యం సోషల్ మీడియాలో మళ్లీ హల్చల్ చేస్తోంది. ఒక మైనర్ బాలుడు ఆటో నడుపుతుండగా, అతని ఒడిలోనే ఒక మహిళ కూర్చుని ప్రయాణిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. నెటిజన్లు దీనిని ఇటీవల జరిగిన ఘటనగా భావించి తెగ షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజానిజాలను చాదర్ఘాట్ పోలీసులు తాజాగా వెల్లడించారు. అసలు ఏం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. 2025 నవంబర్ 7వ తేదీన సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో వైరల్ కాగా, పెట్రోల్ కార్-1 సిబ్బంది దీనిని గుర్తించారు. ఆటో నడుపుతోంది మైనర్ బాలుడని, అలాగే ప్రయాణికురాలిని ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా, అసభ్యకరంగా వాహనం నడుపుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని, నాంపల్లి రెడ్ హిల్స్లోని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. ఈ విచారణలో బాలుడికి ఒక నెల రోజుల పాటు రోజుకు 4 గంటల చొప్పున ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జువెనైల్ బోర్డు కార్యాలయంలో సామాజిక సేవ చేయాలని నిబంధన విధించింది. అంతేకాకుండా, ఈ ఘటనకు సంబంధించి మరొక కేసు వి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
2025 నవంబర్లోనే ఈ వ్యవహారంపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియో పాతదని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు వాస్తవాలు తెలుసుకోకుండా పాత వీడియోలను తాజా సంఘటనలుగా ప్రచారం చేసి ప్రజల్లో అనవసర గందరగోళాన్ని సృష్టించవద్దని కోరారు. ఏదైనా వార్తను లేదా వీడియోను షేర్ చేసే ముందు దాని ప్రామాణికతను నిర్ధారించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.