పిల్లల కోసం ఇల్లు కట్టకండి.. ఓ కంపెనీ సీఈఓ పోస్ట్ వైరల్.. ఆస్తి కంటే అదే ముఖ్యమంటున్న నెటిజన్లు!
గుర్గావ్కు చెందిన ఒక స్టార్టప్ సీఈఓ (CEO) తల్లిదండ్రులకు ఇచ్చిన ఒక వినూత్నమైన సలహా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం అనే సంప్రదాయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీ పిల్లల కోసం ఇళ్లు కట్టకండి అంటూ ఆయన చేసిన పోస్ట్ నెటిజన్లను రెండు వర్గాలుగా చీల్చింది. పిల్లలకు స్థిరాస్తులు ఇచ్చే కంటే ఆ మూడు అతి ముఖ్యమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ మూడు ఏంటో వివరంగా తెలుసుకుందాం..

భారతదేశంలో ప్రతి మధ్యతరగతి తండ్రి కల తన పిల్లల కోసం ఒక ఇల్లు కట్టడం లేదా కొంత ఆస్తిని వెనకేయడం. కానీ, మారుతున్న ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి దృష్ట్యా ఈ ఆలోచనా విధానం మారాలని గుర్గావ్కు చెందిన ఒక యువ సీఈఓ చేసిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. సదరు సీఈఓ తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు.తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుతో పిల్లల కోసం ఇళ్లు కట్టడం మానేయాలి. దానివల్ల మూడు ప్రధాన నష్టాలు ఉన్నాయని చెప్పారు. అవేంటంటే..
1. నైపుణ్యం ముఖ్యం: పిల్లలకు ఇల్లు ఇస్తే వారు సౌకర్యవంతంగా మారిపోతారు (Complacent). వారికి ఆస్తి కంటే, ఆస్తిని సంపాదించే తెలివితేటలను, విద్యను అందించడం మిన్న.
2. మొబిలిటీ (Mobility): నేటి తరం యువత ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. బెంగళూరులో చదువుకుని, గుర్గావ్లో ఉద్యోగం చేస్తూ, చివరకు అమెరికాలో స్థిరపడవచ్చు. అటువంటప్పుడు సొంత ఊరిలో కట్టిన ఇల్లు వారికి భారంగా మారుతుందే తప్ప ఉపయోగపడదు.
3. రిటైర్మెంట్ భద్రత: పిల్లల ఇళ్ల కోసం డబ్బు ఖర్చు చేసి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడటం కంటే, ఆ డబ్బును తమ సొంత అవసరాలకు దాచుకోవడం మంచిది.
ఈ పోస్ట్పై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయారు. మద్ధతుదారులు ఇది నిజమే అంటున్నారు. ఆస్తిని పెంచడం కంటే పిల్లల వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాన్ని పెంచడం ముఖ్యం. ఇల్లు అనేది ఇప్పుడు ఒక లయబిలిటీ (Liability) గా మారుతోంది అని కొందరు అంటున్నారు.
అలాగే, వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. భారతదేశంలో ఇల్లు అనేది కేవలం గోడలు కాదు, అదొక ఎమోషన్. కష్టకాలంలో తలదాచుకోవడానికి సొంత ఇల్లు ఇచ్చే ధైర్యం మరేదీ ఇవ్వదు అని మరికొందరు వాదిస్తున్నారు.
ఏది ఏమైనా ఆర్థిక క్రమశిక్షణ, మారుతున్న ప్రపంచ పోకడల దృష్ట్యా ఈ సీఈఓ చేసిన వ్యాఖ్యలు ఆలోచించదగ్గవే. ఆస్తులు ఇవ్వడం కంటే, ఆస్తులను సృష్టించే సామర్థ్యాన్ని పిల్లలకు అందించడమే నిజమైన వారసత్వం అంటున్నారు మెజారిటీ ప్రజలు.




