ఇలా తయారయ్యారేంట్రా! డెలివరీ బాయ్ వికృత చేష్టలు.. వాష్రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి..
ఐటీ రాజధాని బెంగుళూరులో ఇంటికే వచ్చి సేవలు అందించే డెలివరీ ఎగ్జిక్యూటివ్ల ప్రవర్తనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ సిటీ ప్రాంతంలో ఒక డెలివరీ బాయ్, డాక్యుమెంట్లు ఇవ్వడానికి వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

బెంగుళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో డెలివరీ బాయ్ ఒక మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్-1లో నివసిస్తున్న 30 ఏళ్ల మహిళ తన ఇంటి రెంటల్ అగ్రిమెంట్ రైనోవల్ పత్రాల కోసం ఒక యాప్ ద్వారా డెలివరీ ఆర్డర్ ఇచ్చారు. జూలై 17న ఉదయం మహేష్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఈ పత్రాలతో ఆమె ఇంటికి చేరుకున్నాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి చేయడానికి ఓటీపీ అడగ్గా, మహిళ ఫోన్ తేవాడానికి లోపలికి వెళ్లిన సమయంలో నిందితుడు కూడా అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించాడు.
తాను వాష్రూమ్ వాడుకుంటానని అతడు అడగ్గా, మహిళ నిరాకరించింది. అయినప్పటికీ ఆమె మాట వినకుండా బలవంతంగా వాష్రూమ్లోకి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత దుస్తులు ఏమీ లేకుండా బయటకు వచ్చి, మహిళ ముందు అశ్లీలంగా ప్రవర్తించాడు. ఈ ఊహించని ఘటనతో దిగ్భ్రాంతి చెందిన బాధితురాలు వెంటనే ధైర్యంతో బయటకు వచ్చి కేకలు వేసింది. ఆమె కేకలు విని అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు, చుట్టుపక్కల నివాసితులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని తప్పించుకోకుండా పట్టుకున్నారు.
వెంటనే ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత కేసులు నమోదు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, అక్రమ ప్రవేశం వంటి వివిధ కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి వరుస సంఘటనలతో పెరుగుతున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగుళూరులో ఇలాంటి ఘటన జరగడం కొద్ది రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల మరాఠాహల్లి ప్రాంతంలో కూడా ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ వాష్రూమ్ సాకుతో ఇంట్లోకి దూరి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కేసు నమోదైంది. ఈ వరుస ఘటనలు ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆన్లైన్ డెలివరీ సంస్థలు తమ ఏజెంట్ల నేపథ్యాన్ని సరిగ్గా పరిశీలించాలని, వినియోగదారులు కూడా గుర్తుతెలియని డెలివరీ వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.




