Viral: డబ్బు విత్డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన వ్యక్తి.. పాస్బుక్లో రాసింది చూడగా షాక్
బ్యాంక్ డబ్బును చట్టవిరుద్ధంగా ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు లక్కీ భాస్కర్ సినిమాలో హీరో. ఆ సినిమా సూపర్ హిట్. సేమ్ టు సేమ్ ఇలాగే రియల్ లైఫ్లోనూ చేయాలని ప్లాన్ చేసిన ఓ డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ మాత్రం అన్ లక్కీగా మారిపోయింది.

మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పొద్దు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు.. ఈ మధ్య మనమంతా తరచూ వింటున్న హెచ్చరికలు ఇవి. ఇలాంటి వాటితో అప్రమత్తమవుతున్న చాలామంది బ్యాంకింగ్ విషయాల్లో ఎక్కువగా బ్యాంకింగ్ సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. అయితే కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించాల్సిన బ్యాంకింగ్ సిబ్బందే సైబర్ మోసగాళ్ల తరహాలో మారితే ఏం జరుగుతుంది. బెంగళూరులో వృద్ధ దంపతులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎంతో నమ్మకంగా వ్యవహరించిన డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ వృద్ధ దంపతుల అకౌంట్ నుంచి ఏకంగా రూ. 50 లక్షలు కాజేసేందుకు భారీ స్కెచ్ వేసింది. ఆ ప్లాన్ను దాదాపుగా అమలు చేసింది. కానీ ఆ దంపతుల కొడుక్కి అనుమానం రావడంతో.. విషయం పోలీస్ స్టేషన్ చేరింది. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ క్రైమ్ స్టోరీ గుట్టు రట్టయ్యింది.
బెంగళూరులోని గిరినగర్లో ఒక ప్రైవేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న మేఘనకు ఆ బ్యాంక్లో ఉమ్మడి ఖాతా ఉన్న వృద్ధ దంపతులతో పరిచయం పెరిగింది. అలా వారికి బ్యాంకింగ్ వ్యవహారాల్లో సాయం చేస్తూ వచ్చిన మేఘనను బాగా నమ్మిన ఆ వృద్ధ దంపతులు తాము చామరాజ్పేటలో ఇంటిని అమ్ముతున్న విషయాన్ని కూడా ఆమెతో పంచుకున్నారు. అలా ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బుతో కలిపి వారి ఖాతాలో మొత్తం కోటి రూపాయలు జమ అయ్యాయి. అప్పటివరకు బాగానే ఉన్న మేఘన.. ఆ వృద్ధ దంపతుల బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కొట్టేయాలని ప్లాన్ చేసింది. వృద్ధ మహిళకు FD ఖాతా తెరవడం గురించి అబద్ధం చెప్పి, RTGS పత్రంపై సంతకం చేయించుకుంది. ఆ తర్వాత మరో కొత్త బ్యాంకు ఖాతాకు RTGS ద్వారా రూ.50 లక్షలను బదిలీ చేసుకుంది.
ఒకరోజు ఆ దంపతుల కుమారుడికి ఈ విషయంలో అనుమానం వచ్చింది. వారు చెప్పినంత డబ్బు బ్యాంక్ ఖాతాలో లేదని అతడు గుర్తించాడు. ఫిబ్రవరి 13న కొంత డబ్బును వేరే ఖాతాకు బదిలీ అయినట్టు గుర్తించాడు. దీంతో వారంతా కలిసి గిరినగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని అసలు విషయం కనిపెట్టారు.
విలాసవంతమైన జీవితం గడపాలని కలలుకన్న మేఘన ఇందుకోసం ఆ వృద్ధ దంపతుల డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ ఘోష్ సాయం తీసుకుంది. వీరి సాయంతో ఓ కొత్త అకౌంట్ తెరించి.. RTGS ద్వారా ఆ ఖాతాకు రూ.50 లక్షలు బదిలీ చేయించింది. ఆ తరువాత అందులోని రూ.30 లక్షలు వాళ్లు డ్రా చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. మొత్తం రూ. 50 లక్షలను రికవరీ చేశారు. ఇక పోలీస్ విచారణలో లక్కీ భాస్కర్ స్టోరీ చెప్పింది మేఘన. వృద్ధ దంపతులను మోసం చేసే ఉద్ధేశం తమకు లేదని.. తమకు డబ్బు అవసరం ఉండటం వల్లే వారి డబ్బు తీసుకున్నామని తెలిపింది. ఆ డబ్బుతో లాభం సంపాదించి మళ్లీ వారికే ఇవ్వాలనే ఆలోచన తమకు ఉందని కథ వినిపించింది. కానీ చివరకు పోలీసులకు చిక్కిన ఆమె స్టోరీ అన్ లక్కీగా మిగిలిపోయింది.