Crime News: ఓ వ్యక్తిపై కట్టుకున్న భార్య, కన్న కూతురే దారుణానికి ఒడిగట్టారు. సలసలా కాగుతున్న వేడి వేడి నూనెను అతని ఒంటిపై పోశారు. ఆపై కారం చల్లారు. బాధితుడు పెద్దగా అరవడంతో ఆ తల్లీకూతుళ్లు ఇంటి నుంచి పరారయ్యారు. ఒల్లు గగుర్పొడిచే ఈ ఘటన హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్కు చెందిన సదయ్య, రజిత గత కొంతకాలం క్రితం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట దీనబందు కాలనీలో నివాసముంటున్నారు. సదయ్య కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత నెలలో కుటుంబ కలహాల నేపథ్యంలో రజిత తన భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. తిరిగి వారం రోజుల తరువాత భర్త వద్దకు వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
అయితే, రోజూలాగే సదయ్య వ్యాపారానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి రాగా.. అతను ఇంట్లోకి రాకుండా అతని భార్య, కూతురు ఇంటి గేట్కు తాళం వేసుకున్నారు. అయితే గేట్ తీయాలని ఎంత పిలిచినా వారు రాలేదు. దాంతో సదయ్య పక్క ఇంట్లో నుంచి తన ఇంట్లోకి వెళ్లాడు. అయితే సదయ్యపై ఆగ్రహంగా ఉన్న తల్లీ, కూతుళ్లు అతనిపై వేడి వేడి నూనెను పోశారు. ఆపై కారం చల్లారు. దాంతో నూనె వేడిమిని తాళలేక సదయ్య గట్టిగా కేకలు పెట్టాడు. చుట్టుపక్కన వాళ్లు స్పందించి రాగా.. అప్పటికే తల్లీకూతుళ్లు ఇద్దరూ పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన తల్లీకూతుళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
Also read:
Super Star Rajinikanth: శశికళకు ఫోన్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎందుకంటే..