AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. WhatsApp లింక్ క్లిక్ చేస్తే రూ.48.5 లక్షలు మాయం..!

సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.48.5 లక్షలు కోల్పోయాడు. అమీన్‌పూర్‌లోని జనప్రియ వ్యాలీ ప్రాంతానికి చెందిన బాధితుడికి వాట్సాప్‌లో గుర్తు తెలియని లింక్ రావడంతో దానిపై క్లిక్ చేశాడు. అనంతరం పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మబలికిన మోసగాళ్లు అతడితో దశలవారీగా భారీ మొత్తంలో డబ్బులు చెల్లింపులు చేయించారు.

ఓర్నాయనో.. WhatsApp లింక్ క్లిక్ చేస్తే రూ.48.5 లక్షలు మాయం..!
Cyber Fraud
P Shivteja
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 1:06 PM

Share

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు అధిక లాభాల ఆశతో మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా అదనపు ఉపాధి అవకాశాలు, పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయంటూ ప్రచారం చేస్తూ కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని జనప్రియ వ్యాలీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ.48.5 లక్షలు కోల్పోయాడు. బాధితుడికి వాట్సాప్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక లింక్ వచ్చింది. ఆసక్తితో ఆ లింక్‌ను తెరవగా, అతను ఒక పెట్టుబడిదారుల సమూహంలో చేరాడు. ఆ సమూహంలోని సభ్యులు తక్కువ సమయంలో భారీ లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందని ప్రలోభపెట్టారు. వారి మాటలను నమ్మిన బాధితుడు ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీ నుంచి పలు దఫాలుగా భారీ మొత్తంలో నగదును పంపించడం ప్రారంభించాడు. బాధితుడికి అనుమానం రాకుండా, పూర్తి నమ్మకం కలిగించే ఉద్దేశంతో మోసగాళ్లు మొదట్లో రూ.1.5 లక్షలను లాభాల రూపంలో తిరిగి పంపించారు. దీంతో నిజంగానే ఆదాయం వస్తోందని భావించిన బాధితుడు మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. ఇలా దశలవారీగా దాదాపు రూ.50 లక్షల వరకు వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేశాడు.

అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పెట్టుబడులపై ఎలాంటి లాభాలు రాకపోగా, ఇప్పటికే పంపించిన నగదును వెనక్కి పొందే అవకాశం కూడా లేకుండా మోసగాళ్లు అతని ఖాతాను నిలిపివేశారు. ఫోన్ కాల్స్, సందేశాలకు కూడా స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు.

దీంతో వెంటనే సైబర్ నేరాల సహాయ కేంద్రాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని లింకులను తెరవవద్దని, సామాజిక మాధ్యమాలు లేదా వాట్సాప్ ద్వారా వచ్చే అధిక లాభాల ఆఫర్లను నమ్మి నగదు పంపవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us