
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలోని పంట పొలాల్లో మంగళవారం అరుదైన శ్వేత నాగు ప్రత్యక్షం కావడంతో స్థానికుల్లో కలకలం రేపింది. ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీకి చెందిన ఆసూరి సంతోష్, రవి అనే యువకులు పొలాలను పరిశీలించి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఉన్న పొలంలో సుమారు 9 అడుగుల పొడవు, పూర్తిగా తెల్లటి రంగులో ఉన్న నాగుపాము కనిపించింది. వారు వెంటనే అప్రమత్తమై సురక్షిత దూరం నుంచి గమనించారు. సమాచారాన్ని తెలుసుకున్న రైతు లాండేరి రాజారాం, ఇతర గ్రామస్తులు అక్కడికి చేరుకుని శ్వేత నాగును చూసి ఆశ్చర్యపోయారు.
అటవీ ప్రాంతాల్లో సాధారణంగా నాగుపాములు కనిపించినా, పూర్తిగా తెల్లటి వర్ణంలో ఉండే శ్వేత నాగును చూడటం చాలా అరుదని స్థానికులు తెలిపారు. ఇలాంటి పాములను ఇప్పటివరకు సినిమాలు, సోషల్ మీడియాలో మాత్రమే చూశామని, ప్రత్యక్షంగా చూడటం తమకు ఇదే మొదటిసారని పలువురు తెలిపారు. వన్యప్రాణి నిపుణుల ప్రకారం, జన్యుపరమైన మార్పులైన ల్యూసిజం లేదా అల్బినిజం కారణంగా పాములు ఇలా తెల్లగా కనిపిస్తాయని, ఇవి అరుదుగా కనిపిస్తాయి నిపుణులు చెపుతున్నారు.
శ్వేతనాగు వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.