మరో యూరియా స్కామ్ బట్టబయలు.. ఇదేం కక్కుర్తి సామీ!

యూరియా పంపిణీలో వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చేర్యాలలో వేలాది యూరియా బస్తాలు మాయమైన ఘటన మరువక ముందే, బైరాన్‌పల్లి గ్రామంలో మరో అక్రమం బయటపడింది. కూటిగల్ గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా తీసుకోకపోయినా తీసుకున్నట్లు మొబైల్‌కు సందేశం రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వ్యవస్థ ద్వారానే ఈ అక్రమం బయటపడటం గమనార్హం. యూరియా మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని, రైతులకు ఎరువులు సకాలంలో అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..

మరో యూరియా స్కామ్ బట్టబయలు.. ఇదేం కక్కుర్తి సామీ!
Siddipet Urea Scam

Edited By:

Updated on: Jul 03, 2026 | 7:00 PM

సిద్దిపేట, జులై 3: సిద్దిపేట జిల్లాలో యూరియా పంపిణీలో వరుస అక్రమాలు కలకలం రేపుతున్నాయి. రైతన్నకు అండగా ఉండాల్సిన కొన్ని రైతు సేవా కేంద్రాలే అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. నిన్న చేర్యాల.. నేడు బైరాన్‌పల్లి.. ఇలా రోజుకో చోట యూరియా బస్తాలు మాయమవుతూనే ఉన్నాయి. అధికారుల నిఘా లోపమో.. లేక వ్యాపారుల తెగింపో గానీ.. క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం ఎరువులు దక్కకుండా పోతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లాలో యూరియా మాఫియా రెచ్చిపోతోంది. ధూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన కుమార్ అనే రైతుకు ప్రభుత్వం కేటాయించిన 18 యూరియా బస్తాలను ఓ కేంద్ర నిర్వాహకుడు నొక్కేసాడు.

అన్నదాతకు చెందాల్సిన ఎరువులను కాసులకు కక్కుర్తి పడి పక్కదారి పట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు.ప్రభుత్వం పారదర్శకత కోసం తీసుకొచ్చిన యాప్‌లోనే ఈ వ్యాపారుల బాగోతం బట్టబయలవుతోంది.చేర్యాలలో వేల బస్తాల యూరియా మాయం ఘటన మరువక ముందే.. బైరాన్‌పల్లి గ్రామంలో మరో దందా వెలుగుచూసింది. చేర్యాలలో ఏకంగా 6,429 యూరియా బస్తాలు మాయమైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పెద్ద స్కామ్ మరువక ముందే.. బైరాన్‌పల్లి రైతు సేవా కేంద్రంలో మరో దందా బయటపడింది. అయితే ఈ దందాను ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీయే బట్టబయలు చేసింది.

ఇవి కూడా చదవండి

రైతు కుమార్ అసలు యూరియా బుక్ చేసి తీసుకోకపోయినా.. తీసుకున్నట్టు ఆయన మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. అది చూసి షాకైన సదరు రైతు.. ఇదేంటని రైతు సేవా కేంద్రం యజమానిని నిలదీశాడు. దానికి ఆ యజమాని బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. గ్రౌండ్ లెవెల్‌లో యూరియా మాఫియా ఆగడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. సాంకేతికత సాయంతో అక్రమార్కుల ఆటలు బయటపడుతున్నా.. క్షేత్రస్థాయిలో అక్రమాలు ఆగకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న ఈ యూరియా దందాపై ఉన్నతాధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us