AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: సస్పెన్స్.. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు..? తెలంగాణ కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ..

తెలంగాణ కాంగ్రెస్‌లో మూడు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్‌ కొనసాగుతున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం సమయం లేదు మిత్రమా అంటూ నామినేషన్ వేసేశారు. కరీంనగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం స్థానాల్లో ఫైనల్ అయ్యే అభ్యర్థులు వాళ్లేనా? చివరి నిమిషంలో మార్పులు చేర్పులతో ఏఐసీసీ షాక్ ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

Telangana Congress: సస్పెన్స్.. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు..? తెలంగాణ కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ..
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2024 | 4:47 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో మూడు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులపై సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్‌ కొనసాగుతున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం సమయం లేదు మిత్రమా అంటూ నామినేషన్ వేసేశారు. కరీంనగర్‌, హైదరాబాద్‌, ఖమ్మం స్థానాల్లో ఫైనల్ అయ్యే అభ్యర్థులు వాళ్లేనా? చివరి నిమిషంలో మార్పులు చేర్పులతో ఏఐసీసీ షాక్ ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాబోతున్నా.. పార్టీ అధిష్ఠానం మాత్రం మూడు స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ కరీంనగర్‌లో వెలిచాల రాజేందర్‌రావు నిన్న నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఏఐసీసీ నుంచి ఓరల్‌గా గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే ఆయన నామినేషన్‌ను వేశారన్న వార్తలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

కరీంనగర్‌లో..

కరీంనగర్‌ స్థానానికి అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చాలా కాలంగా ఏఐసీసీ, పీసీసీ నేతలు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. ఫైనల్ చేయడంపై సమావేశాలు సైతం నిర్వహించారు. ఏఐసీసీ లాంఛనంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే రాజేందర్‌రావు నామినేషన్ వేయడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకావడంతో ఏఐసీసీ దాదాపుగా రాజేందర్‌రావు పేరునే ఖరారు చేసే అవకాశం ఉందన్న సంకేతం ఇచ్చినట్లయింది. లాంఛనంగా అభ్యర్థిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాత బీ-ఫామ్ పంపిణీ కానుంది. రాజేందర్‌రావే కంటిన్యూ అవుతారా? లేక చివరి నిమిషంలో మరో పేరు తెరమీదకు వస్తుందా? అనే అనుమానాలూ వెంటాడుతున్నా్యి.

ఖమ్మం సవాల్..

ఖమ్మం నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయడం పీసీసీ, ఏఐసీసీలకు సవాల్‌గా మారింది. ఈ స్థానం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాల్లోనూ ఇదే ప్రతిపాదన చేశారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డిని నిలబెట్టాలనుకున్నారు. వీళ్లిద్దరి పేర్లు తెరపైకి వచ్చిన సమయంలోనే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు బలంగా వినిపించింది. ఈ క్రమంలోనే టికెట్‌ను ఖరారు చేయడానికి ఆ జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటిని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బెంగళూరు పిలిపించుకుని చర్చలు జరిపారు. కానీ అధికారికంగా అభ్యర్థిపై ఏఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

భట్టి, పొంగులేటి ప్రతిపాదించిన ఇద్దరికీ టికెట్ లేదని స్పష్టం చేసిన ఖర్గే.. వారిని కన్విన్స్ చేశారా? లేక ఫలానా వ్యక్తినే నిలబెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారా? లేదంటే ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయం మేరకు సహకారం అందించి కలిసి పనిచేయాలని ఆదేశించారా? ఏం జరిగిందో చర్చల వివరాలు బయటకు రాలేదు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ బంధువు రఘురాం రెడ్డి నామినేషన్ వేశారు.

హైదరాబాద్ సీటుపై సస్పెన్స్..

హైదరాబాద్‌లో నిలబెట్టే అభ్యర్థి విషయంలోనూ సస్పెన్స్ నెలకొంది. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ఖరారు చేయడమా? లేక నాన్-ముస్లిం క్యాండిడేట్‌ను నిలబెట్టడమా? అనే విషయంపైనా పార్టీలో చర్చలు జరిగాయి. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పన్నీర్ ఖాన్‌, మస్కతి ఐస్ క్రీమ్ అధినేత మస్కతి, మహిళా అభ్యర్థి తబుస్సుమ్‌ల పేర్లు వినిపించాయి. అయితే ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా సమీర్ ఉల్లాఖాన్‌ నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది.

మొత్తానికి ఏఐసీసీ నుంచి ప్రకటన వెలువడకముందే ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. మరి అధిష్ఠానం అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటిస్తుంది? వారికే బీఫామ్ ఇస్తుందా? ఇంకేదైనా ట్విస్ట్ ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది.

తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us