AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో కొడుకా ఎంత పని చేశావ్.. కన్నతల్లి మరణవార్త తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య..

తల్లి ప్రేమకు వెలకట్టలేమనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం, కానీ ఆ ప్రేమ ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. కన్నతల్లి ఇక లేదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక 19 ఏళ్ల కుమారుడు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

అయ్యో కొడుకా ఎంత పని చేశావ్.. కన్నతల్లి మరణవార్త తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య..
Medak Tragic Incident
P Shivteja
| Edited By: |

Updated on: Sep 12, 2026 | 5:48 PM

Share

అమ్మంటే ప్రేమ.. అమ్మంటే ప్రాణం.. కానీ ఆ కన్నతల్లే లేదనే నిజాన్ని ఆ 19 ఏళ్ల కుమారుడు తట్టుకోలేకపోయాడు. తల్లి లేని లోకంలో తాను ఉండలేనంటూ.. అమ్మ వెళ్లిన దారినే తాను ఎంచుకున్నాడు! మెదక్ జిల్లాలో ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలో జరిగిన ఈ జంట ఆత్మహత్యలు స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని మక్తా లక్ష్మపూర్ గ్రామానికి చెందిన బేతమ్మ (45), ఆమె భర్త బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అక్కడే నివాసముంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని వారి నివాసంలో భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బేతమ్మ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌లో తల్లి బేతమ్మ ఆత్మహత్య చేసుకున్న విషయం సొంత ఊరిలో ఉన్న ఆమె కుమారుడు ప్రవీణ్ (19)కు తెలిసింది. ప్రాణంగా ప్రేమించే కన్నతల్లి ఇకలేదనే విషయాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన మానసిక వేదనకు లోనైన ప్రవీణ్, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే కొలపల్లి గ్రామ శివారులోకి వెళ్లి, అక్కడ ఉన్న ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు ఇద్దరూ గంటల వ్యవధిలోనే ఆత్మహత్యలకు పాల్పడటంతో మక్తా లక్ష్మపూర్ మరియు కొలపల్లి గ్రామాల్లో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. మరణంలోనూ వీడని ఆ తల్లీకొడుకుల బంధం గురించి తలచుకుని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us