Tragedy in Kamareddy: ముద్దులొలికే కవలలకు తన చేత్తో విషం పెట్టింది ఆ తల్లి. అదే విషాన్ని తానూ మింగింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన కడెం మమతకు కవల పిల్లలు. ఇద్దరూ ఆడపిల్లలే. పేర్లు మహస్రి, మహన్య. 11 నెలల వయసు. ఇద్దరు పిల్లలు కూడా చూడముచ్చటగా ఉంటారు. గోరుముద్దలు తినిపించే చేత్తోనే కూతుళ్లు ఇద్దరికీ అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టింది మమత. తాను కూడా ఆ విషం మింగింది. ఇంకా కట్నం, బంగారం తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తుండటంతో (dowry harassment) ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తల్లి విషం పెట్టడంతో ఇద్దరు చిన్నారుల్లో మహస్రి కామారెడ్డి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మహన్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కామారెడ్డిలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మమత చికిత్స పొందుతోంది. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.