ఆకలితో అలమటిస్తున్న పెద్దపులులు.. కాగజ్నగర్ అటవీ డివిజన్లో జింకలు లేవట..!
కాగజ్నగర్ అటవీ డివిజన్లో పెద్దపులులు ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో మేతకు వస్తున్న పశువులపై పడుతున్నాయి.
Tigers Hungry in forest : కాగజ్నగర్ అటవీ డివిజన్లో పెద్దపులులు ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి. తప్పని పరిస్థితుల్లో మేతకు వస్తున్న పశువులపై పడుతున్నాయి. ఈ డివిజన్లో రెండున్నరేళ్లలో 266 పశువులు పెద్దపులులకు ఆహారంగా మారాయి. తాజాగా మనుషులపైనా దాడులకు దిగుతుండటం కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పులి.. వరుసగా పశువుల మీద దాడి చేస్తూ ఊరి పొలిమేరల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. అడవిలో శాకాహార జంతువులు తక్కువ కావడంతోనే పులులు పశువులపై పంజా విసురుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాది అధికారిక గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 కి పైగానే పశువులు పులికి ఆహారమయ్యాయి. ఒక్క కాగజ్నగర్ డివిజన్లోనే 80 కి పైగా పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకు రూ. 8 లక్షలకి పైగానే పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించింది అటవి శాఖ. ఆదిలాబాద్ డివిజన్ లో 30 పశువులు పులి దాడిలో చనిపోగా 4 లక్షలు, చెన్నూరు డివిజన్లో 50 కి పైగా పశువులు చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు చెల్లించారు. ఈ లెక్కన ఒక్కో పులికి నెలకు ఒక లక్ష ఇరవై ఐదు వేలకు పైగానే ఖర్చవుతున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి.
అయితే ఏ పులైన బలిష్టమైన ఆహారాన్ని ఇష్టంగా తింటుంది. అడవిలో సంచరించే సాంబార్లంటే పులికి బాగా ఇష్టం. కానీ ఈ కాగజ్ నగర్ కారిడార్ లో మాత్రం సాంబర్ల సంఖ్య నామమాత్రమే. దీంతో ఈ ప్రాంతంలో వరుసగా పశువులను చంపుతూ గ్రామాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజలన్ని వణికిస్తోంది మ్యాన్ ఈటర్. ఈ రక్తం రుచిమరిగిన ఏ2 మరో ఆడ పులితో జత కట్టడంతో మరింత ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన అటవిశాఖ.. వాటికి ఆహారంగా వన్య ప్రాణులను సమకూర్చే పనిలో పడింది. కేవలం నాలుగు నెలల్లో ఒక్క ఏ2 పులి పంజాకే 45 వరకు పశువులు చనిపోయాయి. నష్ట పరిహారం కూడా నామ మాత్రంగా ఉండటంతో అటవిశాఖ పై ఆగ్రహాంగా ఉన్నారు ఆదివాసీ రైతులు. దీంతో తప్పని పరిస్థితులో నష్టనివారణను కాస్త అయిన తగ్గించేందుకు వన్య ప్రాణులను కారిడార్ లో వదిలే చర్యలు చేపట్టింది అటవిశాఖ.
మొదటి విడతలో భాగంగా 13 జింకలను తెచ్చిన అధికారులు విడతల వారీగా మరిన్ని జింకలను జిల్లాకు తీసుకురానున్నారు. అయితే మ్యాన్ ఈటర్ తో జత కట్టిన మరో ఆడపులి.. ఇప్పటికే ఈ ప్రాంతంలో సంచరిస్తున్న కే1, కే2 పులుల ఆకలి తీర్చడానికి ఈ 13 జింకలు ఒక్క వారం కూడా సరిపోవన్నది ఆదివాసీల అభిప్రాయం. మరో వైపు ఈ జింకలన్నీ జూలో పెరిగిన జింకలు కాబట్టి మనుషుల మద్య సంచరించి ఊర కుక్కలకు వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదే జరిగితే అటవీశాఖ పులి ఆకలి తీర్చేందుకు చేపట్టిన ఈ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరే.
ఇప్పటికే పులి ఆకలి తీర్చేందుకు నెలకు 25 లక్షలు ఖర్చవుతున్నాయని చెపుతున్న అటవిశాఖ.. పశువుల యజమానులకు నష్టపరిహారం గా ఇస్తున్న సొమ్ము మాత్రం నామమాత్రమే కావడం గమనార్హం. మరీ పులి ఆకలి పూర్తిగా తీర్చి జనవాసాల్లోకి బెబ్బులి రాకుండా చేసే శాస్వత పరిష్కారం ఎప్పుడో చూడాలి.