
గ్రామీణ మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం స్వయం ఉపాధి కార్యక్రమాలను విస్తరిస్తోంది. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు స్థానికంగానే స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే దిశగా పాడి, పశుపోషణ, మత్స్య, కోళ్ల పెంపకం వంటి రంగాల్లో కొత్త అవకాశాలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది.
2026–27 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.90 లక్షల జీవనోపాధి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.77.23 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మండల సమాఖ్యల పరిధిలో వివిధ జీవనోపాధి రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
గత కొన్నేళ్లుగా అమలవుతున్న జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందారు. ఇప్పుడు ఆ అనుభవాన్ని మరింత విస్తరించి, ఎక్కువ కుటుంబాలకు ఆదాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పెరటి కోళ్ల పెంపకం కార్యక్రమానికి ఈసారి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మహిళలకు నాణ్యమైన కోడిపిల్లలు అందించేందుకు ప్రత్యేక మదర్ యూనిట్లు ఏర్పాటు చేశారు. టీకాలు పూర్తయిన తర్వాతే కోడిపిల్లలను అందించడం వల్ల మరణాల శాతం తగ్గి, గుడ్లు, మాంసం విక్రయాల ద్వారా మహిళలకు క్రమం తప్పకుండా ఆదాయం సమకూరుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, మేకల పెంపకానికి మంచి మార్కెట్ ఉండటంతో ఆ రంగానికీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు రుణాలు అందించే అవకాశం కల్పిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం వల్ల మహిళలు స్వయం ఉపాధి వైపు మరింత ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గొర్రెలు, మేకల పెంపకాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలను కూడా ఏర్పాటు చేశారు. నాణ్యమైన జాతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పశువైద్య సేవలు, టీకాలు, సాంకేతిక సలహాలు కూడా అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
పశుపోషణతో పాటు మత్స్య రంగానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. సబ్సిడీతో మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు, చేపల పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు పాల ఉత్పత్తుల విక్రయానికి మిల్క్ పార్లర్లు, పశుగ్రాస యూనిట్లు, చాఫ్ కట్టర్లు, క్వెయిల్ పక్షుల పెంపకం వంటి అనుబంధ రంగాలకు కూడా మద్దతు అందిస్తున్నారు. గ్రామీణ మహిళలకు ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా బహుళ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
మహిళలు ఉత్పత్తి చేసిన పాలకు సరైన మార్కెట్ లభించేలా డెయిరీ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మహిళల ఆధ్వర్యంలో డెయిరీలను ఏర్పాటు చేసి, పాల సేకరణ నుంచి విక్రయం వరకు సమగ్ర మద్దతు అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
జీవనోపాధి యూనిట్లు కేవలం మంజూరు చేయడమే కాకుండా వాటి నిర్వహణపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల ఏర్పాటు, పశువైద్య సేవలు, టీకాలు, మార్కెటింగ్ సౌకర్యాలు వంటి అన్ని దశల్లో క్షేత్రస్థాయి సిబ్బంది సహకారం అందిస్తున్నారు. దీంతో యూనిట్లు స్థిరంగా కొనసాగి మహిళలకు నిరంతర ఆదాయం అందే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గి, సొంత ఆదాయంతో కుటుంబానికి అండగా నిలిచే స్థాయికి చేరుకుంటున్నారని పేర్కొంటున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడంలో ఈ పథకాలు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..