Telangana SIR: తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ.. ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్!
Telangana SIR: నేటితో ఫారమ్ల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియ ముగియడంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు తదుపరి దశపై దృష్టి సారించారు. డిజిటైజ్ అయిన డేటా ఆధారంగా త్వరలోనే డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ విడుదల చేస్తారు. ఓటు తొలగింపుపై నోటీసులు ఇచ్చి, ప్రజల..

Telangana SIR: తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఎన్యుమరేషన్ ఫారమ్స్ సమర్పణ, డిజిటైజేషన్ గడువు నేటితో ముగిసింది. ఈ సర్వే ప్రక్రియ ముగింపునకు రావడం, మరోవైపు డిజిటైజేషన్ ప్రక్రియలో తీవ్ర మందగమనం నమోదు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది.
గల్లంతు దిశగా 73 లక్షల ఓట్లు.. ప్రధాన కారణాలేంటి?
- రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఎలక్టోరల్ ఫారమ్స్ పంపిణీ 100% పూర్తయింది. అయితే ఇప్పటివరకు కేవలం 2,64,30,494 ఫారమ్స్ మాత్రమే డిజిటైజ్ అయ్యాయి.
- పత్రాల అసంపూర్తి సమర్పణ: ఓటర్లు సరైన గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు (Documents) సమర్పించకపోవడం వల్ల లక్షలాది ఫారమ్లు తిరస్కరణకు గురవుతున్నట్లు సమాచారం.
- వలసలు, డబుల్ ఓట్లు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, చిరునామాలు మారడం కూడా ఓట్ల తొలగింపునకు కారణమవుతోంది.
- సరిహద్దు జిల్లాల్లో తనిఖీలు: సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఓట్లపై అధికారులు ప్రత్యేకంగా పరిశీలన జరుపుతున్నారు.
జిల్లాల వారీగా డిజిటైజేషన్ స్థితిగతులు
రాష్ట్ర వ్యాప్తంగా సగటున 78.14 శాతం డిజిటైజేషన్ పూర్తి కాగా, కొన్ని జిల్లాలు ముందంజలో ఉంటే.. గ్రేటర్ పరిధిలోని గ్రామీణ, అర్బన్ ప్రాంతాలు వెనుకబడ్డాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా 94.30 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. అలాగే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు రాష్ట్ర సగటు (78.14 శాతం) కంటే తక్కువగా అత్యధికంగా ఓట్లు గల్లంతయ్యే ముప్పున్న ప్రాంతాలుగా తెలుస్తోంది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్ మొదలైన జిల్లాలు స్పెషల్ స్క్రూటినీ పరిధిలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో 2 లక్షలకుపైగా ఓట్లపై ప్రత్యేక నిఘా ఉంచారు అధికారులు.
ఓటర్ల జాబితా షెడ్యూల్
నేటితో ఫారమ్ల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియ ముగియనుండటంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు తదుపరి దశపై దృష్టి సారించారు. డిజిటైజ్ అయిన డేటా ఆధారంగా త్వరలోనే డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ విడుదల చేస్తారు. ఓటు తొలగింపుపై నోటీసులు ఇచ్చి, ప్రజల నుంచి వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. క్లెయిమ్స్ అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




