కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన కాంగ్రెస్.. చిట్యాలలో ప్రత్యేక విజయం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 2026లో కాంగ్రెస్ పార్టీ 800 వార్డులు దాటి భారీ ఆధిక్యాన్ని సాధించింది. నల్గొండ జిల్లా చిట్యాలలో, ట్రాన్స్జెండర్ స్వతంత్ర అభ్యర్థి కావేరి (సుధాకర్) వార్డు 1లో చారిత్రాత్మక విజయం సాధించారు, ఇది సమాజంలో మార్పునకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన కౌంటింగ్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు – 2026లో కాంగ్రెస్ హవా కొనసాగింది.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యాన్ని సాధించి 800 మార్కును దాటింది. నల్గొండ జిల్లా చిట్యాల ఫలితాల్లో ఆసక్తికరమైన రిజల్ట్ కనిపించింది. సమాజంలో ఇప్పటికీ కాస్త చిన్నచూపునకు గురయ్యే ట్రాన్స్జెండర్ల నుంచి పోటీలో దిగిన అభ్యర్థి మున్సిపల్ పోరులో విజేతగా నిలిచారు. చిట్యాల మున్సిపాలిటిలోని ఒకటో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచిన సుధాకర్ అలియాస్ కావేరి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కావేరి 101 ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రజాసమస్యలు పరిష్కరించే దిశగానే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ఊరి ప్రజలు తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు సంతోషంగా ఉందన్నారు. తన గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు కావేరి.
నివేదికల ప్రకారం, కౌంటింగ్ ట్రెండ్లు అందుబాటులో ఉన్న 1,615 వార్డులలో, కాంగ్రెస్ 876, బిఆర్ఎస్ 462, బిజెపి 138, ఇతరులు 139 వార్డులలో ఆధిక్యంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్ల కౌంటింగ్ రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాలలో నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
