BRS Party: పార్టీని వేగవంతంగా విస్తరిస్తున్న సీఎం కేసీఆర్.. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే’ అంటూ హామీల వర్షం..

|

Jan 27, 2023 | 9:11 PM

సోషలైజేషన్‌ ఆఫ్‌ లాసెస్..! ప్రైవటైజేషన్‌ ఆఫ్‌ ప్రాఫిట్స్..! ప్రస్తుతం దేశంలో ఇదే జరుగుతోందని విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లైనా..

BRS Party: పార్టీని వేగవంతంగా విస్తరిస్తున్న సీఎం కేసీఆర్.. ‘బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే’ అంటూ హామీల వర్షం..
Brs Party
Follow us on

సోషలైజేషన్‌ ఆఫ్‌ లాసెస్..! ప్రైవటైజేషన్‌ ఆఫ్‌ ప్రాఫిట్స్..! ప్రస్తుతం దేశంలో ఇదే జరుగుతోందని విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లైనా ఇంకా రైతుల కష్టాలు ఎందుకు తీరడం లేదని ప్రశ్నించారాయన.! ఈ కష్టాల నుంచి గట్టెక్కించి.. దేశానికి దశ-దిశ చూపేందుకే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భవించిందని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీ శాఖను ప్రకటించిన కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రక్రియను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఒడిశాలోనూ జోరు పెంచిన కేసీఆర్.. శుక్రవారం ఆ రాష్ట్ర మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌ను గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం పలికారు.

శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన గిరిధర్ గమాంగ్.. సాయంత్రం 4 గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో జరిగిన ఈ తంతులో గిరిధర్‌తో పాటు ఆయన కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, భార్య హేమ గమాంగ్‌ కూడా గులాబీ పార్టీలో చేరారు. ఇంకా వారితో పాటు ఒడిశా మాజీ మంత్రి జయరాం పాంగి, మాజీ ఎమ్మెల్యే నబిన్ నందా సహా మొత్తం 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు BRS తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ప్రజలకు కనీసం మంచినీళ్లు, విద్యుత్‌ ఇవ్వలేని దుస్థితి దేశంలో నెలకొందని విమర్శించారు కేసీఆర్. దేశంలో రంగురంగుల జెండాలు చూశాం కానీ..పేదలు, రైతుల స్థితిగతులు మాత్రం మారలేదన్నారు. ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి..కానీ ప్రజలు ఓడుతున్నారని ఆరోపించారు కేసీఆర్. నష్టాలపేరుతో జనాలకు చిల్లులు పెడుతున్న కేంద్రం.. లాభాలను మాత్రం బడాపారిశ్రామిక వేత్తలకు పంచుతోందని దుయ్యబట్టారు కేసీఆర్. BRS అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా దళితబంధు, రైతుబంధు అమలు చేస్తామన్నారు. 24 గంటల కరెంట్‌తోపాటు తాగునీటిని ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో పర్యటించనున్నారు కేసీఆర్. అక్కడ కూడా పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

ఇవి కూడా చదవండి