
తెలంగాణ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ఠ ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే మూడు రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలో ఎండలు, తీవ్ర వడగాలుల పరిస్థితులపై మంత్రి సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత ఎంత దారుణంగా ఉందో కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది.
వడదెబ్బతో మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
రెడ్ జోన్ల గుర్తింపు: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడి ప్రజలను మైకుల ద్వారా ముందస్తుగా అప్రమత్తం చేయాలి.
ఉచిత మజ్జిగ, ORS కేంద్రాలు: ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో చలివేంద్రాలతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్, ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.
వైద్య సిబ్బంది అలర్ట్: వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రుల వరకు అత్యవసర మందులు, అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలి.
కలెక్టర్ల పర్యవేక్షణ: వడగాలుల తీవ్రతపై అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యక్తిగతంగా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
మానవులతో పాటు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న పక్షులు, జంతువుల ప్రాణాలను కాపాడటం మన బాధ్యతని మంత్రి గుర్తుచేశారు. అటవీ ప్రాంతాల్లో, గ్రామాల్లో నీటి తొట్టెలు, మట్టి కుండల ద్వారా మూగజీవా లకు తాగునీటి వసతి కల్పించాలని స్వచ్ఛంద సంస్థలకు, అధికారులకు పిలుపునిచ్చారు.