Telangana: యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. సబ్సిడీతో ఈవీ వెహికల్స్.. కొత్త పథకం ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ యువతకు భారీ శుభవార్త అందించింది. భారీ సబ్సిడీతో ఈవీ వాహనాలను అందించనుంది. లాజిస్టిక్, ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. నిరుద్యోగ ఎస్సీ యువత దీని ద్వారా స్వయం ఉపాధి కూడా పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

Telangana: యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. సబ్సిడీతో ఈవీ వెహికల్స్.. కొత్త పథకం ప్రారంభం
Ev Vechiles

Updated on: Apr 16, 2026 | 1:24 PM

తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఎస్సీ యువతకు భారీ శుభవార్త అందించింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్ధిక సాయం అందిస్తోంది. అందులో భాగంగా ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే యువతకు ప్రోత్సాహం అందించేందుకు ముందడుగు వేసింది. ఈ మేరకు యువతకు ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకే అందించనుంది. భారీ సబ్సిడీతో ఈవీ వెహికల్స్‌ను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా.. వచ్చే వారం నుంచి లబ్దిదారులను ఎంపిక చేయనుంది. అనంతరం అర్హులైనవారికి వెహికల్స్‌ను పంపిణీ చేసేందుకు సిద్దమవుతోంది.

రూ.3 లక్షల విలువ చేసే వాహనాలు పంపిణీ

పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత 10 వేల మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం రూ.219 కోట్ల ఖర్చు చేయనుంది. ఈ వెహికల్స్ ద్వారా లాజిస్టిక్స్, ఈ-కామర్స్, డెలివరీ రంగాల్లో యువత రాణించవచ్చు. దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. 5016 మందికి టూవీలర్లను అందించనుంది. ఒక్కొ యూనిట్‌ విలువ రూ.లక్షగా నిర్ణయించింది. ఇక 2508 మందికి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందించనున్నారు. ఇందుకోసం ఒక్కొ ఈవీ వెహికల్‌కు రూ.3 లక్షల ఖర్చు కానుంది. వీటి కోసం తయారీదారుల నుంచి టెండర్లను ఆహ్వానించనుంది. ఈ నెలాఖరు కల్లా టెండర్లను ఖరారు చేయనుంది. ఇక బీడుపట్టిన ఎస్సీ రైతుల భూములను సాగులోకి తెచ్చేందుకు సోలార్ ప్రాజెక్టులను చేపట్టనుంది. రూ.3 నుంచి రూ.7 లక్షల ఖర్చుతో సోలార్ పంపుసెట్లను అందించనుంది. అలాగే గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన తరహాలో కొత్త కార్యక్రమం అయలు చేయనుంది.

Follow Us