Telangana Elections 2023: సిట్టింగ్లకు ఫిట్టింగ్.. ఎంఐఎంలో ఆ ఇద్దరి దారెటు?
మొత్తంగా మూడు నియోజకవర్గాల సిట్టింగ్లను మార్చాలని ఎంఐఎం పార్టీ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, యాకుత్పురా, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే చార్మినార్ స్థానంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. అయితే ఓవైసీ బ్రదర్స్ దీనిపై ప్రకటన చేసే వరకు ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తుల్లో మునిగిపోయాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఇప్పటికే గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక పనిలో నిమగ్నమైంది. అయితే ఎంఐఎంకు కంచుకోటలుగా కొన్న హైదరాబాద్లోని పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని యోచిస్తోంది పార్టీ నాయకత్వం. దీంతో ఆయా స్థానాల్లో సిట్టింగ్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
మొత్తంగా మూడు నియోజకవర్గాల సిట్టింగ్లను మార్చాలని ఎంఐఎం పార్టీ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, యాకుత్పురా, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే చార్మినార్ స్థానంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముంతాజ్ అహ్మద్ ఖాన్ 1994 నుంచి యాకుత్పురాలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం అధిష్టానం ఆయన్ని చార్మినార్ నుంచి బరిలోకి దింపింది. యాకుత్పురా నియోజకవర్గంలో ముంతాజ్ అహ్మద్ఖాన్పై కాస్త వ్యతిరేకతతో పాటు పలు ఆరోపణలు రావడంతో ఆయన స్థానాన్ని మార్చి చార్మినార్ నుంచి పోటీ చేయించారు. ఈ నియోజకవర్గంలోనూ ఆయన భారీ మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
తొలిసారి యాకుత్పురా నియోజకవర్గంలో ముంతాజ్ అహ్మద్ఖాన్ ఎంబీటీ నుంచి పోటీ చేసి గెలిచాక ఎంఐఎంలో చేరారు. అయితే గత ఎన్నికల్లో ఈయనకు చార్మినార్ కేటాయించడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రికి యాకుత్పురా కేటాయించారు. అక్కడ ఆయన విజయం సాధించారు. అయితే ఇప్పుడు అహ్మద్ పాషా ఖాద్రి ఆనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ని పక్కన పెట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆ స్థానంలో మరొకరిని పోటీ చేయించాలని చూస్తుంది పార్టీ హైకమాండ్.
అలాగే చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ఖాన్ను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్బరుద్దీన్ అహ్మద్ఖాన్ను కలిసి దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు కూడా జరిపారు. చార్మినార్ బరి నుంచి తప్పుకోవాలని కోరారు. సుదీర్ఘకాలం పనిచేశారని, ఇప్పటికైనా తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వాలని నచ్చచెప్పినట్టు సమాచారం. కానీ ఇందుకు ముంతాజ్ అహ్మద్ఖాన్ ససేమిరా అనడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. తానూ అన్ని విధాలుగా ఆరోగ్యంగానే ఉన్నానని, ప్రజాసేవ చేస్తున్నానని, మరికొంతకాలం కొనసాగుతానని పట్టుబట్టినట్టు ఎంఐఎం వర్గాలు చెబుతున్నాయి. అయితే అహ్మద్ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మూడు గంటల సుదీర్ఘ చర్చల్లో ఇద్దరు ఏం తేల్చారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు.. కానీ కుటుంబంలో నుంచి ఒకరికి టికెట్ ఇవ్వాలని ముంతాజ్ అహ్మద్ఖాన్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) చరిత్ర చూసుకుంటే కుటుంబం నుంచి ఒక వ్యక్తికి ఒకేసారి టికెట్ కేటాయిస్తారు. మళ్లీ ఆ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ప్రస్తుతం నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేని యాకుత్పురాకి మార్చి నాంపల్లి, చార్మినార్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని ఎంఐఎం భావిస్తోంది. మిగతా స్థానాల్లో అన్ని బాగానే ఉన్నా చార్మినార్ స్థానంలో మాత్రం ముంతాజ్ అహ్మద్ ఖాన్ అడ్డం తిరిగారు. అయితే ఓవైసీ బ్రదర్స్ దీనిపై ప్రకటన చేసే వరకు ఆశావహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
