
బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా అవసరమైన ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రెస్ నోట్ జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..