CM KCR: ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌.. టీ హబ్‌ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

T-Hub 2.0: వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించారు.ఒకే సమయంలో..

CM KCR:  ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్‌.. టీ హబ్‌ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
T Hub 2.0
Follow us

|

Updated on: Jun 28, 2022 | 8:16 PM

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ “టీ–హబ్‌” 2.0 ఆవిష్కృతమైంది. వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుంది. ఈ ప్రాంగణం టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రాంగ‌ణమంతా సీఎం కేసీఆర్ క‌లియ తిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను వాటి వివరాలు తెలుసుకున్నారు. టిహబ్ పై అంతస్తులో కారిడార్లో కలియ తిరిగి నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. దేశ విదేశాల్లోని ఐటి కేంద్రాలను తలదన్నేలా నిర్మితమైన భవనాలను సిఎం తిలకించారు.

ఫెసిలిటీ సెంట‌ర్ ప్ర‌త్యేక‌త‌ల‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివ‌రించారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు, పలు రకాల కంపెనీల ప్రతినిధులు టి హబ్ కేంద్రంగా చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన.. మీటింగ్ హాల్స్, వర్క్ స్టేషన్లను సిఎం పరిశీలించారు. టిహబ్ ఇన్నొవేషన్ సెంటర్ కు సంబంధించిన విషయాలన్నింటినీ అధికారులను మంత్రి కెటిఆర్ ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. టి హబ్ ను అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో అత్యాధునిక డిజైన్‌తో సాండ్‌ విచ్‌ ఆకారంలో ప్రత్యేకంగా టీ హబ్ ను నిర్మించడం జరిగిందని వారు తెలిపారు. టీ హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించామని వారు ముఖ్యమంత్రికి చెప్పారు.

మొదటి అంతస్తులో మొత్తం వెంచర్ కాపిటలిస్టులకోసం కేటాయించామని మంత్రి కెటిఆర్ సిఎం కు తెలిపారు. టిహబ్ భవనం చుట్టూ విస్తరించి వున్న ప్రముఖ కంపెనీలను సిఎం కలియతిరుగుతూ పరిశీలించారు. గేమింగ్, యానిమేషన్, సినిమాల్లో త్రీడీ ఎఫెక్టుల వంటి రంగాల్లో కృష్టి చేస్తున్న సంస్థలన్నీ హైద్రాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని మంత్రి కెటిఆర్ వివరించారు.

ఈ సందర్భంగా ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించిన మంత్రి కేటీఆర్ తో పాటు, అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరుచుకునే దిశగా, సైబర్ క్రైం ను అరికట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూం ను మరింతగా అభివృద్ది చేసేందుకు టిహబ్ తో సమన్వయం చేసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డికి సిఎం కెసిఆర్ సూచించారు.

రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా., దైనందిన జీవితంలో సామాన్య ప్రజల జీవన విధానాలు గుణాత్మకంగా పురోగమించేందుకు అంకుర సంస్థలు కృషి చేసేందుకు టిహబ్ దృష్టి సారించాలని సిఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న యువతలోని టాలెంట్ ను కూడా వినియోగించుకునే దిశగా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సిఎం తెలిపారు. భవిష్యత్తులో హైద్రాబాద్ లో ఐటి రంగంలో పురోగతి మరింతగా పెరుగుతుందని, దానికనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు అధికారులు దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

టీ హబ్‌-2 ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ స్పీక‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్థన్ రెడ్డి, టిఎస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టిఎస్ టిఎస్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు, సీ ఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి, టిహబ్ సీఈవో శ్రీనివాస రావు, బిఆర్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. టిహబ్ లో అంకుర సంస్థల ప్రతినిధులు దేశ, విదేశాలకు చెందిన ఐటి రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. టిహబ్ నిర్మాణంలో పాలుపంచుకున్న పలువురితో పాటు టిహబ్ లో భాగస్వాములైన పలు అంకుర సంస్థల ప్రతినిధులను, సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. టీహబ్ ప్రాంగణం మొత్తం ఐటీ దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది.

తెలంగాణ వార్తల కోసం