AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Budget: రానున్న నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు.. ఆ రంగంలో ఇప్పటికే శిక్షణ ప్రారంభించామన్న కేటీఆర్

రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని..

Telangana Budget: రానున్న నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు.. ఆ రంగంలో ఇప్పటికే శిక్షణ ప్రారంభించామన్న కేటీఆర్
Ktr in assembly
K Sammaiah
|

Updated on: Mar 20, 2021 | 2:06 PM

Share

Telangana Budget: నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కో ఆకాంక్షను నెరవేర్చుకుంటూ వస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మన నీళ్లు మన పంటపొలాలకే పారుతున్నాయని.. మన నిధులు మన రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్పిన మంత్రి.. నియామకాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టిందని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మంత్రి కేటీఆర్‌ హాట్‌హాట్‌గా ప్రసంగించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రి సామాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్‌ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఎలక్ట్రానిక్‌ సిస్టమ్ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 60 వేల మందికి దీనికి సంబంధించి శిక్షణ ఇవ్వగా.. 30 వేల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్‌ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.

రాష్ట్రానికి కొత్తగా 40 పరిశ్రమలు వచ్చాయని, రూ.2 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నామని కేటీఆర్‌ వివరించారు. విద్యుత్‌ వాహనాల 2020- 30 విధానాలు అవలంబిస్తున్నామని తెలిపిన మంత్రి.. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్‌ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో పరిణామాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామని కేటీఆర్‌ సభకు వెల్లడించారు.

టీఎస్‌ బీపాస్‌ ప్రారంభించిన 100 రోజుల్లోనే 12,943 భవనాలకు అనుమతి ఇచ్చామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శాసనసభలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి 600 గజాల వరకు స్వయం దరఖాస్తుల ఆధారంగా ఆన్‌లైన్ అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లోనే ఆక్యుపెన్సీ ధ్రువపత్రం సైతం జారీ చేస్తున్నామని తెలిపారు. కేపీహెచ్‌బీలో ఇళ్ల పునర్మిర్మాణానికి ఉచితంగా అనుమతులు కల్పించాలంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తి చేయగా.. పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.