AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సోషల్ మీడియా ఉచ్చులో టి బీజేపీ.. సొంత పార్టీ నేతలనే పీకి పడేయాల్సిన పరిస్దితి!

తెలంగాణ బీజేపీలో ఏం నడుస్తోంది అంటే ఏ లోకల్ బాడీ ఎన్నికలపైనో, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటంపైనో చర్చ కాదు.. సొంత నేతల సోషల్ మీడియా పోస్టుల రచ్చ నడుస్తోంది. కమలం పార్టీకి ప్రత్యర్థులు ఎక్కడో లేరు. సొంతపార్టీలోనే పక్కలో బల్లెంలా తయారయ్యారు కొందరు. వర్గాలుగా వీడిపోయి ఒకరిమీద ఒకరు ఇష్టారీతిన పోస్టులు పెడుతూ పార్టీ పరువుకాస్త రోడ్డున పడేస్తున్నారు. పార్టీకి నష్టం జరుగుతుందా లేదా అన్నది చూసుకోకుండా సొంతనేతలపై వికృత రాతలతో విరుచుకుపడుతున్నారు. ఇదే ఇప్పుడు కాషాయ పార్టీ కొంప ముంచుతోంది.

Telangana: సోషల్ మీడియా ఉచ్చులో టి బీజేపీ.. సొంత పార్టీ నేతలనే పీకి పడేయాల్సిన పరిస్దితి!
T Bjp
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 9:09 PM

Share

ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత కొందరు మరింత రెచ్చిపోయి పార్టీ పెద్ద నేతలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. పార్టీలో ఇంటర్నల్ గా వారికి ప్రత్యర్థి అని భావించిన వారిపై అనుచరులతో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారు. ఈ సంస్కృతి ఎక్కువ కావడంతో అసలు ఇష్యూ ఎక్కడని అధిష్ఠానం ఆరా తీసింది. రాష్ట్ర పార్టీలో కీలక నేతల మధ్య ఇంటర్నల్ వార్ కారణంగానే వారి టీమ్స్ ఇలా ఒకరి మీద ఒకరు నెగెటివ్ పోస్టులతో రెచ్చిపోతున్నారని షాకింగ్ విషాయలు బయటపడ్డాయి.

దీంతో అధిష్టానం సీరియస్ అయింది. పార్టీకి నష్టం కలిగే పోస్టులు పెట్టినవారిని వెంటనే పీకి పారేయాలని స్టేట్ చీఫ్ రాంచందర్ రావుకు ఆదేశాలిచ్చారట. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదన్న సంకేతాలు కిందిస్థాయిలో బలంగా వెళ్లేలా సంకేతాలు ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయింది. ఎవరైనా చిన్న వ్యతిరేక పోస్ట్ పెట్టినా.. నోటీసులు కూడా ఇవ్వకుండా వాళ్లను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు బింగి వెంకటేశ్ ఓ గ్రూప్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని.. దీన్ని సీరియస్ గా తీసుకున్న పార్టీ అధిష్టాణం వెంటనే పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేసింది. దీంతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, మరికొంతమంది ఎంపీలపై పర్సనల్ గా అటాక్ చేసేలా కామెంట్స్, పోస్టులు పెడుతున్న వారిపై పార్టీ అధిష్టానం నజర్ పెట్టింది. అవసరమైతే వారిపై న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ వ్యవహారంపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు వ్యక్తులను టార్గెట్ చేశామనుకొని పార్టీకి డ్యామేజ్ చేస్తున్నామనే విషయాన్నే మర్చిపోతున్నారని సగటు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పార్టీలో ఇంటర్నల్ వార్ కు సైతం చెక్ పెడితేనే ఇలాంటి సోషల్ వైరస్ తగ్గుతుందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇద్దరు కీలక బీజేపీ నేతల మధ్య వార్ ను కూడా కేంద్రం అబ్జర్వ్ చేస్తోంది. వారిపై ఓ కన్నేసి ఉంచమని రాష్ట్ర అధ్యక్షుడికి సూచించినట్టు తెలుస్తోంది. దీంతో వారి టీమ్స్ చేసే పోస్టులపై రాష్ట్ర నాయకత్వం నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. మరి కమలం కకావికలం కాకుండా సోషల్ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us