Supreme Court: తెలంగాణ సర్కార్కు ‘సుప్రీం‘ ఊరట.. నష్టపరిహారం విషయంలో హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. కాళేశ్వరం, అనంతగిరి, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయంలో…
Supreme Court given big relief to Telangana Government: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. కాళేశ్వరం, అనంతగిరి, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం (మార్చి 16న) తోసిపుచ్చింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని, వివాహం కాని మేజర్ యువతీ, యువకులకు సైతం విడిగా నష్ట పరిహారం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఇదివరకు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై మంగళవారం విచారణ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనలను, వెర్షన్ను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండానే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వైద్యనాథన్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. తెలంగాణ హైకోర్టు హడావిడిగా విచారణ ముగించినట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏఎం ఖన్విల్కర్ సారథ్యంలో ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి హడావిడి విచారణలను ఆమోదించలేమని బెంచ్ తేటతెల్లం చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చిన ఖన్విల్కర్ ధర్మాసనం భూ సేకరణకు సంబంధించి నష్టపరిహారం కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను మళ్ళీ విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను స్వయంగా తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తే చేపట్టాలని సూచించింది. అదే సమయంలో పదే పదే వాయిదాలు కోరవద్దని తెలంగాణ అడ్వకేట్ జనరల్ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
ALSO READ: ప్రత్యేక కోర్టులో దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ వ్యూహంపై ఇపుడు ఉత్కంఠ