
నిర్మల్, ఏప్రిల్ 15: ఆడపిల్ల పుడితే ఇంటికి భారం అని భావించే రోజులు పోవాలని, ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆ ఊరికే గర్వకారణం కావాలన్న ఉద్దేశ్యంతో నిర్మల్ రూరల్ మండలం అనంత పేట్లో ఆడబిడ్డకు పూల మొక్కతో స్వాగతం అంటూ నగదును అందిస్తూ సర్పంచ్ మాదాస్తు సునీత ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ఆ ఊరిలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పుట్టినా వెంటనే ఆ చిన్నారి పేరు మీద బ్యాంకులో 5 వేల రూపాయలు జమ చేయనున్నారు. దీంతో ఆ పాప పెద్దయ్యాక ఉన్నత చదువులకు లేదా పెళ్లి ఖర్చులకు ఈ పొదుపు మొత్తం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు.
నగదు సాయమే కాకుండా రెండు శ్రీగంధ చెట్లను బహుమతిగా అందించాలని నిర్ణయించారు. అందుకే తమ గ్రామంలో ‘మా ఊరి బంగారు తల్లి’ అనే పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూడకుండా, తన సొంత నిధులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం. పథకం ప్రారంభం రోజున గ్రామానికి చెందిన కుంటాల శ్రావణి, రాంచందర్ దంపతుల కూతురు స్మృతి పేరిట రూ. 5 వేలు డిపాజిట్ చేసి ఆదర్శంగా నిలిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.