
మహిళలను రక్షించాల్సిన పోలీసులే వారి పాలిట విలన్లుగా మారుతున్నారు. కొంతమంది కీచక పోలీసులు చేసే చేష్టల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ పైనే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడింది. సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పని చేయాలి. కానీ మొన్నటి వరకు సిద్దిపేట జిల్లాలో పని చేసిన ఓ రక్షక భటుడు.. భక్షుకుడిగా మారిపోయి ఓ యువతిని కాటేశాడు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బేగంపేట్ పోలీస్ స్టేషన్లో అరుణ్ అనే వ్యక్తి ఎస్ఐగా ఈ నెల 16వ తేదీ వరకు విధులు నిర్వహించాడు. ఇటీవలే కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యాడు. ఎస్ఐ అరుణ్ పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని కేసు నమోదైంది.
ఈ ఘటనపై బాధిత యువతి.. ఎస్ఐ అరుణ్పై సైదాబాద్లోని ఉన్నతస్థాయి అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అరుణ్ మోసం చేశాడని యువతి పేర్కొంది. అరుణ్ గతంలో హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కేసుపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో తన ఫోన్ నెంబర్ను తీసుకుని.. ఆపై ప్రేమించానని చెప్పాడని తెలిపింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు.. ఎస్ఐ అరుణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఒక్క యువతే కాదని.. అరుణ్ మాయలో పడిన అమ్మాయిలు ఇంకా చాలామంది ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా, ఎస్ఐ అరుణ్ మళ్లీ ఇలాంటి తప్పులు చేయకుండా కఠినంగా శిక్షించాలని బాధిత యువతితో పాటు, పలు మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..