Pulses: పప్పులు – పరుగులు.. మినపపప్పు నుంచి కందిపప్పు వరకు పెరిగిన ధరలు.. తాజా రేట్లు ఇవే

సామాన్యులపై భారం పడుతోంది. పప్పుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి.

Pulses:  పప్పులు - పరుగులు.. మినపపప్పు నుంచి కందిపప్పు వరకు పెరిగిన ధరలు.. తాజా రేట్లు ఇవే
Pulses
Follow us

|

Updated on: May 31, 2023 | 5:35 PM

పప్పులు నిప్పులు చెరుగుతున్నాయి. కొంటే చేతులు కాలేటట్టు చేస్తున్నాయి. తిందామంటే వంట మంట రేపుతోంది. ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు వాపోతున్నారు. కిచెన్‌లో కల్లోలం రేగుతోంది. వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. మసూర్‌ దాల్‌ కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. పల్లీల రేటు కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. ఇక సూపర్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్‌ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్‌ పేరుతో ప్యాక్‌ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాలు, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది.

దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గత ఏడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్‌ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్‌ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా పప్పుల దిగుబడి తగ్గడమే ఈ ధరలు పెరుగుదలకు కారణం అంటున్నారు వ్యాపారస్తులు.

పప్పు ధాన్యాలు ఇప్పుడు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయని చెబుతున్నారు. పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్‌ లాంటి మెయిన్‌ మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే నో స్టాక్‌బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిస్తున్నారని చెబుతున్నారు.. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయంటున్నారు. దీనివల్ల త్వరలోనే కిలో కందిపప్పు ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.