Telangana: నీటిలో ఏంటవీ.. ఈ అంతరించిపోతున్న అరుదైన జీవులను గుర్తుపట్టారా…?
అరుదైన క్షీర జాతికి చెందిన జీవులు ఇవి. ఇవి నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని నీళ్లలోనే జీవిస్తాయి. భూమిపైన కూడా జీవించగలవు. ఏంటో కనిపెట్టారా..?
Otters: నీటి కుక్కలు అరుదైన ఉభయచర జీవులు. ఎప్పుడో కానీ మనిషి కంటికి కనపడవు. తాజాగా గోదావరి తీరంలో అరుదైన క్షీర జాతికి చెందిన నీటి కుక్కలు సందడి చేస్తూ సందర్శకులకు కనిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Jayashankar Bhupalpally district) మహాదేవపూర్ మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)ఎగువ కన్నెపల్లి పంప్ హౌస్ సమీపంలో ఈ నీటి కుక్కలు నదిలో ఈదుతూ కనిపించాయి. ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయకపోయినా, చేపలు పట్టే మత్స్యకారులకు మాత్రం చాలా నష్టం చేస్తాయంటున్నారు. గోదావరిలో చేపల కోసం వేసిన వలలను కొరుకుతూ వలలో చిక్కిన చేపలను తింటాయంటున్నారు. అంతేకాకుండా నీటిలో చేపల కన్నా ఎక్కువ వేగంగా ఈదగలుగుతాయన్నారు. ఇవి నీళ్ల లోపల ఈదుతాయి… నీళ్ల లోపల, నీళ్ల బయట కూడా జీవిస్తాయి. నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అంతరించి పోతున్న అరుదైన జాతి కావటంతో వీటిని సంరక్షించాలని పర్యాటకులు, జంతుప్రేమికులు కోరుతున్నారు. మడ అడవులను, చిత్తడి నేలలను అభివృద్ధి చేయడం ద్వారా వీటి సంతతిని పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. నీటిలో వేగంగా దూసుకెళ్లే నీటికుక్కలు శబ్ధాలను గ్రహిస్తాయని, ఏదైనా వినిపిస్తే వెంటనే నీటిలో మునిగి గంటల తరబడిగాను బయటకు రావని లోపల కూడా వేగంగానే ముందుకు కదులుతాయని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..