Telangana: గర్భిణీలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ అప్పటి నుంచే..

తెలంగాణలో గర్భిణీలకు మంత్రి హరీష్‌ రావు శుభవార్త తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. వైద్యారోగ్య శాఖ డే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలు చేయాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు...

Telangana: గర్భిణీలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ అప్పటి నుంచే..
KCR Nutrition Kit
Follow us

|

Updated on: May 23, 2023 | 3:37 PM

తెలంగాణలో గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం కీలక విషయాలను వెల్లడించారు. వైద్యారోగ్య శాఖ డే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలు చేయాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనతో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తం చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య శాఖకు కేటాయించిన రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. 2023-24 లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6.84 లక్షల మహిళలు లబ్ధి పొందుతారనీ, 14-26 వారాల సమయంలో రెండో ANC సమయంలో, 27-34 వారాల సమయంలో మూడో ANC సమయంలో మొత్తం రెండు సార్లు కిట్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ప్రారంబించిన కేసీఆర్ కిట్లు ఒక అద్భుత పథకం అని, దీని వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం, రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందన్నారు. మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే మనం మూడో స్థానంలో నిలిచామని, ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను ముఖ్యమంత్రి గారు కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్స్‌ పథకానికి రూపకల్పన చేశారనీ మంత్రి అన్నారు.. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ కాగా, ఇదే స్ఫూర్తితో కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్లకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. నాలుగు ఏఎన్‌సీ చెకప్స్‌, కేసీఆర్‌ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు వంటివి రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు దోహదం చేస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.

రక్తహీనత అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వం ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ లో మొత్తం1.25 లక్షల మంది గ‌ర్బిణుల‌కు రెండు ఏఎన్‌సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా (మిగతా 24 జిల్లాల్లోనూ) కిట్స్ పంపిణీ నీ వైద్యారోగ్య శాఖ ప్రారంభించనుందన్నారు.. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్, ఐరన్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యం. ఇక గర్భిణీలకు ఇచ్చే ఒక్కో కిట్ విలువ రూ. 2 వేలు కాగా ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయానుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రాథమిక వైద్యాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన పల్లె, బస్తి దవాఖానలు వెంటనే ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఇప్పటికే మంజూరు అయిన సబ్ సెంటర్ల నిర్మాణాలు, మరమ్మతు పనులు వేగవంతం చేయాలన్నారు. దూరంగా కాకుండా, ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇవి ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, ఇతర విభాగాల హెచ్ వో డి లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..