Medak: మందుబాబులకు రైతు మాస్ వార్నింగ్.. తన తోటలో మద్యం సేవిస్తే..
మెదక్ జిల్లాలో ఓ రైతు మందుబాబుల బెడదకు వినూత్న పరిష్కారం కనుగొన్నాడు. తన మామిడి తోటను మద్యం సేవించడానికి వాడుతున్న వారిని అడ్డుకునేందుకు, ఇక నుంచి తోటలో మందు తాగితే 25 చెప్పు దెబ్బలు, రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ బ్యానర్ ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. మద్యం సేవించడానికి ఓ రైతు మామిడి తోటను వాడుకుంటున్నారు కొంతమంది మందుబాబులు. ఎన్నిసార్లు వద్దని చెప్పిన లాభం లేకుండా పోయింది. నిత్యం తన తోటలోనే మందు తాగుతూ ఖాళీ సీసాలు వదిలిపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన రైతు పోచయ్య వినూత్నంగా ఆలోచన చేశాడు. ఇక నుంచి తన మామిడి తోటలో మద్యం సేవిస్తే 25 చెప్పు దెబ్బలు, 5 వేల రూపాయల జరిమానా విధిస్తామని బ్యానర్ ఏర్పాటు చేసాడు.
నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు పోచయ్యకి ఎకరా మామిడి తోట ఉంది..కాగా ఆ తోటలో నిత్యం మందుబాబులు అడ్డా ఏర్పాటు చేసుకొని మద్యం సేవిస్తున్నారు. అంతేకాకుండా కొందరు సీసాలు అక్కడే పగలగొడుతున్నారు. దీంతో పొలంలో నడవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇక లాభం లేదని రైతు పోచయ్య ఇక నుంచి మామిడి తోటలో మద్యం సేవిస్తే 25 చెప్పు దెబ్బలు, 5 వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. తన ఎకరం మామిడి తోటలో అనుమతులు లేకుండా యదేచ్చగా వచ్చి మద్యం సేవించి, బిరియాని ప్యాకెట్లు, ప్లాస్టిక్ కాగితాలు వదిలేసి అంతర్ సాగు చేసుకోకుండా ఇబ్బందిగా గురి చేస్తున్నారని, మద్యం బాటిళ్లు పగలగొట్టడం వల్ల, కాళ్లకు గాజు సీసాలు గుచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామని, అందుకుగాను తమ ఎకరా మామిడి తోట పొలంలో ఎవరు మద్యం సేవించకుండా బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.దయచేసి తమ మామిడి తోట పొలంలో ఎవ్వరు మద్యం సేవించడానికి రావొద్దని.. వస్తే మాత్రం బ్యానర్ ఏర్పాటు చేసిన విధంగా శిక్ష తూచా తప్పకుండా అమలు చేస్తామంటూ హెచ్చరించాడు రైతు.
వీడియో దిగువన చూడండి…
