
ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు అనడానికి హనుమకొండ నగరంలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. గాలి వాన లేదు, కనీసం ఆకాశంలో మబ్బు కూడా లేదు.. మండుటెండలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై ఉన్నట్టుండి భారీ వృక్షం కుప్పకూలింది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా ప్రాణభయంతో వణికిపోయారు. తృటిలో పెను ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిరిసిల్ల డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు హనుమకొండ వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్టాండ్ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ వద్ద మూల మలుపు తిరుగుతున్న క్రమంలో బస్సుకు విద్యుత్ వైర్లు చుట్టుకున్నాయి. ఆ ఒత్తిడికి పక్కనే ఉన్న భారీ వృక్షం వేళ్లతో సహా పెకళించుకుపోయి ఒక్కసారిగా బస్సుపై పడింది. క్షణాల వ్యవధిలో చెట్టు కుప్పకూలడంతో బస్సులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.
ఈ ప్రమాదంలో రహదారి పక్కన నిలిపి ఉంచిన రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు చెట్టు కింద నలిగిపోయి పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట ట్రాఫిక్ సీఐ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సుపై, రోడ్డుపై పడిన భారీ కొమ్మలను యుద్ధప్రాతిపదికన తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఎలాంటి గాలి, వర్షం లేని సమయంలో జరిగిన ఈ వింత ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.