
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న LRS ఫీజుల చెల్లింపులను వేగవంతం చేసేందుకు 25 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ మే 1 నుంచి జూలై 31, 2026 వరకు అమల్లో ఉండనుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MA&UD) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో LRS కోసం దరఖాస్తు చేసుకుని, ఇంకా పూర్తి చెల్లింపులు చేయని వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటగా మారనుంది. నిర్ణీత గడువులోపు పెండింగ్ మొత్తాలను చెల్లిస్తే, 25 శాతం తగ్గింపుతో ఫీజును చెల్లించే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వసూలు కావడమే కాకుండా, దరఖాస్తుదారులపై ఉన్న ఆర్థిక భారం కూడా కొంత తగ్గనుంది.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనుమతి లేని లేఅవుట్లు విస్తరించిన నేపథ్యంలో వాటిని చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకురావడమే LRS పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రక్రియ ద్వారా ప్లాట్లకు లీగల్ స్టేటస్ లభించి, భవన అనుమతులు పొందడం సులభమవుతుంది. అలాగే రిజిస్ట్రేషన్, కొనుగోలు..అమ్మకాల ప్రక్రియలు కూడా నిరాటంకంగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు గడువులు పొడిగించినప్పటికీ, అనేక మంది దరఖాస్తుదారులు ఇంకా ఫీజులు చెల్లించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రాయితీతో మరో అవకాశం కల్పించింది. అయితే ఈసారి గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పొడిగింపు లేదా రాయితీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
MA&UD శాఖ దరఖాస్తుదారులను అప్రమత్తం చేస్తూ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వెంటనే చెల్లింపులు పూర్తి చేసుకోవాలని సూచించింది. గడువులోపు రాయితీని వినియోగించుకుంటేనే పూర్తి లాభం పొందవచ్చని తెలిపింది. మొత్తంగా ఈ నిర్ణయం వేలాది మంది LRS దరఖాస్తుదారులకు ఉపయోగపడే అవకాశం ఉండగా, పెండింగ్ ఫీజుల వసూళ్లలో కూడా ప్రభుత్వం భారీ పురోగతి సాధించనుంది.