Hyderabad: బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్..
హైదరాబాద్ బిర్యానీ అంటేనే నోరూరిపోతుంది.. కానీ అదే బిర్యానీ ప్లేట్లో బల్లి కనిపిస్తే? వినడానికే అసహ్యంగా ఉన్న ఈ ఘటన పాతబస్తీలోని ఓ హోటల్లో నిజంగానే జరిగింది. ఇష్టంగా తింటున్న బిర్యానీలో బల్లిని చూసిన ఆ కస్టమర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. అసలేం జరిగింది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భాగ్యనగరంలో మరోసారి ఆహార భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాతబస్తీ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్లో బిర్యానీలో బల్లి ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు హోటల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహబూబ్ హోటల్లో ఈ దారుణం వెలుగు చూసింది. ఒక కస్టమర్ హోటల్కు వెళ్లి ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేశాడు. ముక్కలు తింటుండగా, ప్లేట్లో చనిపోయిన బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. అప్పటికే బిర్యానీలో కొంత భాగం తినేయడంతో సదరు కస్టమర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
యాజమాన్యం తీరుపై ఆగ్రహం
ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కస్టమర్కు, హోటల్ నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఇతర వినియోగదారులు కూడా ఈ ఘటనను చూసి విస్మయానికి గురయ్యారు. కొందరు ఈ దృశ్యాలను సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించాలని బాధితుడు కోరుతున్నాడు. అధికారులు వచ్చి హోటల్ను తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
బెంబేలెత్తుతున్న ప్రజలు
బిర్యానీకి కేరాఫ్ అడ్రస్గా ఉండే పాతబస్తీలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల జనం భయపడుతున్నారు. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ వంటగదుల్లో కనీస పరిశుభ్రత పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా లైసెన్స్లు రద్దు చేసేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
