- Telugu News Photo Gallery AP Divyang Student Satyanarayana Conquers Everest Base Camp: Inspiring Success Story
వైకాల్యాన్ని జయించి విజయకేతనం.. విద్యార్థి చరిత్ర
ఏలూరు : శారీరక లోపాలు ప్రగతికి ప్రతిబంధకాలు కావని, అండగా నిలిచే మనసు.. ప్రోత్సహించే సమాజం ఉంటే ఎంతటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ దివ్యాంగ విద్యార్థి. పుట్టుకతోనే వినికిడి లోపం వేధిస్తున్నా, మాటలు రాకపోయినా.. తన సంకల్ప బలాన్నే శ్వాసగా మార్చుకుని నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును ముద్దాడాడు.
Updated on: Jul 14, 2026 | 4:28 PM

Ap 1

తోటి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, స్నేహితులను సంపాదించుకోవడం మొదట్లో అతడికి పెద్ద సవాలుగా మారింది. అయితే, తల్లి అందించిన తిరుగులేని ప్రోత్సాహంతో పెంటపాడులోని 'భవిత' కేంద్రంలో అడుగుపెట్టిన సత్యనారాయణ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఇటీవలే 2026లో పదో తరగతి పూర్తి చేసిన ఈ యువకుడిలోని ప్రతిభను ఆ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయురాలు సాయి స్వరూప గుర్తించారు.

అతడికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ, మానసికంగా, శారీరకంగా బలోపేతం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ సత్యనారాయణ అద్భుత ప్రతిభ కనబరిచాడు. శరీర దారుఢ్యం కోసం షాట్పుట్, పరుగు పందాలు, కొండలు ఎక్కడం వంటి కఠినమైన వ్యాయామాలలో తర్ఫీదు పొందాడు. ఈ పట్టుదలే అతడిని గతేడాది జోనల్ స్థాయి శారీరక దారుఢ్య పోటీలకు ఎంపికయ్యేలా చేసింది.

శిక్షణే పునాదిగా.. శిఖరం వైపు అడుగులు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 21 మంది దివ్యాంగ విద్యార్థులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఎవరెస్ట్ యాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ ప్రతిష్టాత్మక బృందంలో ఒకడిగా సత్యనారాయణ చోటు దక్కించుకున్నాడు. యాత్రకు ముందు కఠినమైన వాతావరణాన్ని తట్టుకునేందుకు వీలుగా గండికోటలో నెల రోజుల పాటు సాగిన ప్రత్యేక ట్రెకింగ్ శిక్షణలో పాల్గొని తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత హిమాలయాల అంచుల్లో సాగిన ఉత్కంఠభరిత ప్రయాణంలో అన్ని అడ్డంకులను అధిగమిస్తూ, ఇటీవల నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుని విజయకేతనం ఎగురవేశాడు. మాటలు రాకపోయినా, తన అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆకాశమంత విజయాన్ని అందుకున్న సత్యనారాయణ వృత్తాంతం.. వైకల్యంతో బాధపడుతున్న ఎంతోమంది విద్యార్థులకు, వారికి అండగా నిలవాల్సిన సమాజానికి ఒక దిక్సూచిలా నిలుస్తోంది.
