Hyderabad: యూట్యూబ్లో చూసి వైన్ తయారు చేశాడు.. ఆరు నెలల్లో ఎంత సంపాదించాడో తెలిస్తే..
యూట్యూబ్ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కానీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ప్రతి పనిని వ్యాపారంగా మార్చేయడం కుదరదు. ముఖ్యంగా చట్టపరమైన అనుమతులు అవసరమైన రంగాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ప్రశంసలతో మొదలైన ప్రయాణం.. పోలీస్ కేసుతో ముగిసే ప్రమాదం ఉంటుంది. అచ్చం లాంటి ఘటనే హైదరాబాద్లో వెలుగు చూసింది. యూట్యూబ్ చూసి వైన్ తయారు చేసేందుకు ప్రయత్నించిన యువకుడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

ఒప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే రోజులు, గంటలు తరబడి బుక్స్ చదవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కాలం మారింది.. ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంటుంది. వంటలు, క్రాఫ్ట్స్, టెక్నాలజీ ఇలా ఎన్నో విషయాలు క్షణాల్లో యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ అదే యూట్యూబ్లో చూసి చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తే మాత్రం పరిణామాలు ఎలా ఉంటాయో హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారు చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన ఆంటోనీ పీటర్ యూట్యూబ్లో వైన్ తయారీకి సంబంధించిన వీడియోలు చూశాడు. ఇంట్లోనే పండ్లతో సహజ పద్ధతిలో వైన్ తయారు చేయవచ్చని తెలుసుకున్నాడు. దీంతో మార్కెట్ నుంచి వివిధ రకాల పండ్లను తీసుకొచ్చి ఇంట్లోనే వైన్ తయారు చేయడం ప్రారంభించాడు. మొదట తాను తయారు చేసిన వైన్ను తన స్నేహితులకు రుచి చూపించాడు. వారు వైన్ రుచి బాగుందని ప్రశంసించడంతో ఆంటోనీకి మరింత ధైర్యం వచ్చింది. ఇది మార్కెట్లో కూడా అమ్మితే మంచి డిమాండ్ ఉంటుందేమో అనుకున్నాడు. అలా చిన్న ప్రయోగంగా మొదలైన పని.. క్రమంగా పూర్తి స్థాయి వ్యాపారంగా మారిపోయింది.
ఒకటి కాదు.. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఏకంగా ఏడు రకాల ఫ్రూట్ వైన్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. కేవలం తయారు చేయడమే కాదు.. సోషల్ మీడియా, పరిచయాల ద్వారా కస్టమర్లను సంపాదించి డోర్ డెలివరీ కూడా ప్రారంభించాడు. ఇలా దాదాపు ఆరు నుంచి ఏడు నెలల పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వ్యాపారాన్ని రహస్యంగా కొనసాగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయం చివరకు ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఆంటోనీ ఇంటిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అక్కడ భారీగా నిల్వ ఉంచిన వైన్ బాటిళ్లు, తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలు, ఇతర సామగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
పోలీసుల దాడుల్లో సుమారు రూ.1.50 లక్షల విలువైన 377 లీటర్ల వైన్, తయారీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆంటోనీ పీటర్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కీలక హెచ్చరిక చేశారు. లైసెన్స్ లేకుండా మద్యం తయారు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అంతేకాకుండా సరైన ప్రయోగశాల పరీక్షలు, నాణ్యత నియంత్రణ లేకుండా తయారు చేసిన వైన్ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలిగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి మద్యం సేవించడం వల్ల విష ప్రభావం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
