
ఇంటి ముందు ఆడుకుంటూ కనబడకుండా పోయినా బాలిక.. మరుసటి రోజు స్థానికంగా ఉన్న ఒక నీటి సంపులో శవమై కనిపించిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇల్లందు మండలం మామిడిగూడెం పంచాయితీ సుంకర గూడెం గ్రామానికి చెందిన కాలం ప్రభాకర్, తేజ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఉదయం చిన్న కూతురు ప్రాన్సి (3) ఇంటి వద్ద ఆడుకుంటూ సడెన్గా కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు కూతురి కోసం గ్రామం మొత్తం వెలికారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు.
దీంతో వెంటనే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి పాప అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులతో పాటు చిన్నారి కోసం గ్రామస్తులు, బంధువులు తల్లిదండ్రులు మళ్లీ వెతకడం మొదలు పెట్టారు. అయితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఓ ఇంటి కాంపౌండ్లో ఉన్న నీటి సంపులో చిన్నారి మృతదేహం కనిపించింది. అది చూసిన గ్రామస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే బాలికను బయటకు తీశారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అయితే చిన్నారి మృతదేహం దొరికిన సంప్ మూత పెట్టి ఉండడంతో బాలిక మరణంపై స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానికుల సమాచారంతో ఘటన పై కేసు నమోదు చేసుకున్న ఇల్లందు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయింది. లేదా ఎవరైన హత్య చేసి సంప్లో వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.